వారి ఖాతాల్లోకి నేరుగా రూ.18 వేల కోట్లు విడుదల చేసిన మోడీ: 20 శాతం వడ్డీ బాధలు తప్పేలా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మరో విడత నిధులు విడుదల అయ్యాయి. మరో విడత చెల్లింపుల కింద కేంద్ర ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేసింది. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకుని శుక్రవారం ఈ మొత్తాన్ని కేంద్రం విడుదల చేసింది.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొద్దిసేపటి కిందటే ఈ నిధులను విడుదల చేశారు. అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్లలోకి ఈ మొత్తాన్ని బదలాయించారు.
భీమా కోరేగావ్ వార్షికోత్సవం: 17 గ్రామాల్లో టెన్షన్..టెన్షన్: 114 సెక్షన్: వారం ముందే నిఘా
తొమ్మిది కోట్ల మంది రైతుల సంక్షేమానికి ఈ నిధులను విడుదల చేశారు. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాలతో పాటు భారతరత్న, మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కూడా కావడం వల్ల శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద నిధులను విడుదల చేసిన తరువాత.. నరేంద్ర మోడీ ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులతో ముఖాముఖి భేటీలో పాల్గొన్నారు. తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో భేటీ అయ్యారు. పలు అంశాలను ప్రస్తావించారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ సహా ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాల లబ్దిని రైతులు పొందాలని సూచించారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ప్రధాని అన్నారు. మూడు వ్యవసాయ బిల్లులపై ఎలాంటి అపోహలను పెట్టుకోవద్దని విజ్ఙప్తి చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన నవీన్ అనే రైతు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
2019లో తాను కిసాన్ క్రెడిట్ కార్డ్ను తీసుకున్నానని, దీని ద్వారా నాలుగు శాతం వడ్డీతో 27 వేల రూపాయల రుణాన్ని బ్యాంకులు తనకు మంజూరు చేశారని అన్నారు. దళారులు 20 శాతం వడ్డీతో రైతులకు రుణాలు ఇచ్చేవారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మోడీ మాట్లాడారు. రైతులు ఎవరూ నష్టపోకూడదనేది తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి పెద్ద ఎత్తున రుణాలను తీసుకుని ఆర్థిక ఊబిలో రైతులు చిక్కుకునిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. ఒకవంక మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా ఉత్తరాది రైతులు దేశ రాజధానిని ముట్టడించిన ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్ర మోడీ.. మరో విడత కిసాన్ సమ్మాన్ నిధుల మొత్తాన్ని విడుదల చేయడం, అదే సమయంలో ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.