ఢిల్లీ కాలుష్యంతోపాటు తుఫానులపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమీక్ష
న్యూఢిల్లీ: దేశ రాజధానితోపాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అత్యంత ప్రమాకర స్థాయికి చేరిన వాయు కాలుష్యంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. వాయు కాలుష్యంపై మోడీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు పీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది.
Delhi pollution:చావనివ్వండని వదిలేస్తారా?:ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం, రాష్ట్రాలకు సమన్లు
ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రాతోపాటు ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యంతోపాటు గుజరాత్ సహా పశ్చిమ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తుఫానుల వల్ల తలెత్తే పరిస్థితులపైనా సమీక్షించినట్లు ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వాయు కాలుష్యంపై సోమవారం జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుకు పలు సూచనలు చేసింది. ఢిల్లీలో అత్యయిక పరిస్థితుల కన్నా అధ్వాన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఢిల్లీ ప్రజలు స్వచ్ఛమైన గాలిని కూడా పీల్చుకోలేని పరిస్థితులో ఉన్నారని పేర్కొంది.
కాలుష్యానికి ప్రధాన కారణమైన పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో పంటల వ్యర్థాలను తగలబెట్టడం ఆపాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఇదివరకు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరి, బేసి విధానంపైనా పలు ప్రశ్నలను సుప్రీంకోర్టు సంధించింది. దాని వల్ల ఏం సాధించారని నిలదీసింది. ఇది ఇలావుండగా, ఢిల్లీతోపాటు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో నెలకొన్న వాయు కాలుష్యంపై స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. మీరు చొరవ తీసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.