రైతులపై జవాన్ల ప్రయోగమా ? మోడీ అహంకారానికి నిదర్శనమన్న రాహుల్ గాంధీ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన కొనసాగుతోంది. హర్యానా, పంజాబ్, యూపీతో పాటు పలు చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో నిరసనలు చేపట్టేందుకు పంజాబ్, హర్యానా నుంచి బయలుదేరిన రైతులను పోలీసులు, భద్రతా బలగాలు సరిహద్దుల్లోనే అడ్డుకున్నాయి. కేంద్రం అనుమతించే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని రైతులు ప్రకటించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న రైతులకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారు. రైతులను అణచివేసేందుకు వారిపై లాఠీఛార్జీ చేయడాన్ని రాహుల్ తప్పుబట్టారు. లాఠీఛార్జికి కేంద్రమే బాధ్యత వహించాల్సి వస్తుందని రాహుల్ హెచ్చరించారు. మన నినాదం జై జవాన్, జై కిసాన్ అని, కానీ ప్రధాని మోడీ మొండివైఖరి, అహంకారం వల్ల రైతులకు వ్యతిరేకంగా జవాన్లు నిలబడాల్సి వచ్చిందని రాహుల్ ఆరోపించారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదని రాహుల్ తన తాజా ట్వీట్లో పేర్కొన్నారు.
రైతులపై లాఠీ ప్రయోగిస్తున్న జవాను ఫొటోను ట్వీట్ చేసిన రాహుల్ కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మోడీ అహంకార ధోరణి వల్లే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు రాహుల్ తెలిపారు. మరోవైపు రైతుల ఆందోళనపై హర్యానా, పంజాబ్ ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్దం కూడా కొనసాగుతోంది. ఈ నిరసనల్లో తమ రాష్ట్రానికి చెందిన రైతులెవరూ పాల్గొనడం లేదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ ప్రకటించారు. ఈ ఆందోళనల్లో పాల్గొంటున్న వారికి ఖలిస్తాన్ ఉద్యమంతో సంబంధాలు ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్.. రైతులకు క్షమాపణ చెప్పేవరకూ హర్యానా ముఖ్యమంత్రితో మాట్లాడబోనని తెలిపారు.
बड़ी ही दुखद फ़ोटो है। हमारा नारा तो ‘जय जवान जय किसान’ का था लेकिन आज PM मोदी के अहंकार ने जवान को किसान के ख़िलाफ़ खड़ा कर दिया।
— Rahul Gandhi (@RahulGandhi) November 28, 2020
यह बहुत ख़तरनाक है। pic.twitter.com/1pArTEECsU