పోలీస్ అధికారిపై ప్రధాని సోదరుడి చిందులు, ఏం జరిగింది?
ఇండోర్: తన స్నేహితుడి పైన కేసు నమోదు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ఓ పోలీసు అధికారి పైన తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ విషయమై సదరు పోలీసు అధికారిని కలిశారు.
ఈ విషయం ఇండోర్లో జరిగింది. ఓ దాబా యజమాని ప్రహ్లాద్ మోడీ సోదరుడు. అతని పైన పోలీసులు కేసు పెట్టారు. దీనిపై ఇండోర్ పోలీస్ చీఫ్ను కలిసిన ప్రహ్లాద్ మోడీ ఆయన పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాబా యజమాని అనిల్ రాథోడ్తో పాటు మరో ఏడుగురి పైన పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద మన్పూర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో కేసు నమోదు చేశారు. రాధేశ్యాం భిల్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దాబా యజమాని అనిల్ రాథోడ్ మాత్రం పరారీలో ఉన్నాడు. పోలీసులు మంగళవారం నాడు అనిల్ రాథోడ్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. సమాచారం మేరకు ప్రహ్లాద్ మోడీ అనిల్ రాథోడ్ ఇంటిలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చారు.
ఏం జరిగింది?
ప్రహ్లాద్ సోదరుడు అనిల్ రాథోడ్ కారు టైరు పంక్చర్ కావడంతో రిపేర్ చేయాలని ఆ ప్రాంతంలో ఓ వ్యక్తిని కోరారు. అయితే అందుకు ఆ వ్యక్తి నిరాకరించారు. దీనిపై ఆగ్రహించిన రాథోడ్, అతడి అనుచరులు అతనిపై దాడి చేసి, అతని కుటుంబంలోని మహిళలను వేధించారనే వాదనలు ఉన్నాయి.
సదరు వ్యక్తి దళిత వ్యక్తి కావడంతో అనిల్ రాథోడ్, అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసులు నమోదు చేయడంతో, అనిల్ రాథోడ్ పరారయ్యాడు. అతని అనుచరుల్ని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు.