కేంద్ర కేబినెట్ బెర్త్ కోసం టిడిపి యత్నాలు: రేసులో వీరే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రిమండలిని విస్తరించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అశావాహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తు మోడీ కేబినెట్లో టిడిపి ఎంపి అశోక్ గజపతిరాజుకు మాత్రమే చోటు దక్కింది. తాజా విస్తరణలో మరో మంత్రి పదవి కోసం టిడిపి తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి టిడిపి ఎంపీలు సుజనా చౌదరి, సిఎం రమేష్, తెలంగాణ రాష్ట్రం నుంచి టిడిపి ఎంపి మల్లారెడ్డి కేంద్రమంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో ఏపికి చెందిన ఎంపి అశోక్ గజపతిరాజుకు చోటు దక్కిన నేపథ్యంలో తెలంగాణకు చెందిన మల్లారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కేందుకు అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. కేబినెట్ మంత్రి అరుణ్ జైట్లీని కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఈ రెండు భేటీల్లో కేంద్ర కేబినెట్ విస్తరణలో తమ పార్టీకి చోటు కల్పించాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది.
చంద్రబాబు యత్నాలు ఫలిస్తే రేసులో ఉన్న సిహెచ్ మల్లారెడ్డి, సుజనా చౌదరి, సిఎం రమేష్లలో ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. అంతకుముందు ఢిల్లీలో సిఐఐ(భారత పరిశ్రమల సమాఖ్య) సదస్సులో పాల్గొన్న అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్రమంత్రివర్గ విస్తరణపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ను మిషన్గా పెట్టుకున్నామని, రాబోయే రోజుల్లో నైపుణ్యం కలిగిన యువతను అందిస్తామని ఆయన సిఐఐ సమావేశంలో తెలిపారు.
మరోవైపు వ్యవసాయాన్ని కూడా ఓ మిషన్గా పెట్టుకున్నామని, వ్యవసాయ అభివృద్ధి జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెడతామని చంద్రబాబు తెలిపారు.
కేంద్ర కేబినెట్ విస్తరణలో పదిమందికి అవకాశం
నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం 45మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో ఏడుగురు మహిళా ఎంపీలు ఉన్నారు. కాగా, ప్రస్తుతం విస్తరించనున్న మంత్రివర్గంలో సుమారు పది మందికి అవకాశం కలగనుంది. మోడీ విదేశీ పర్యటనకు ముందే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది.
కీలకమైన రక్షణశాఖ, ఆర్థిక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న అరుణ్ జైట్లీకి ఒక్క ఆర్థిక శాఖను కేటాయించి రక్షణ శాఖను గోవా సిఎం మనోహర్ పారికర్కు అప్పగించాలనే యోచనలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం మనోహర్ పారికర్ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను, ప్రధాని మోడీని కలిసిన విషయం తెలిసిందే.
మంత్రివర్గ విస్తరణలో మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు, హజరిబాగ్ ఎంపి జయంత్ సిన్హాలకు చోటుదక్కే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న ప్రకాశ్ జవదేకర్లకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది.