ఇప్పటివరకూ ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఇచ్చిన విరాళాలు ఎంతో తెలుసా...?
కరోనాపై పోరు కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్కు ప్రారంభ కార్పస్గా ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యక్తిగతంగా రూ.2.25లక్షలు విరాళమిచ్చారు. ఈ విషయాన్ని పీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. పీఎం కేర్స్ ఫండ్ విరాళాలకు సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ బుధవారం(సెప్టెంబర్ 2) బయటకు రాగా... ప్రారంభ విరాళం ఎవరిచ్చారన్నది అందులో పేర్కొనలేదు. తాజాగా పీఎంవో కార్యాలయం ఆ విరాళం ప్రధాని ఇచ్చిందేనని స్పష్టం చేసింది.
పీఎం కేర్స్ ఫండ్కు మోదీ వ్యక్తిగతంగా ప్రారంభ విరాళం ఇవ్వడాన్ని కేంద్రమంత్రులు పీయుష్ గోయల్,స్మృతీ ఇరానీ,పలువురు బీజేపీ నేతలు ట్విట్టర్లో ప్రశంసించారు. అయితే మోదీ ఇలా విరాళం ఇవ్వడం ఇదే మొదటిసారేమీ కాదు. ఇప్పటివరకూ ఆయన ఇచ్చిన విరాళాల విలువ రూ.103 కోట్లు దాటినట్లు పీఎంవో వర్గాలు వెల్లడించాయి. బాలికల విద్యకు సంబంధించిన పథకాలు మొదలు క్లీన్ గంగా మిషన్ వరకూ ఎన్నో కార్యక్రమాలకు ఆయన విరాళాలు ఇచ్చారు.
2019లో కుంభమేళాలో పారిశుద్ద్య కార్మికుల సంక్షేమం కోసం తన వ్యక్తిగతంగా రూ.21లక్షలు ప్రధాని ప్రారంభ విరాళంగా ఇచ్చారు. 2019లో సియోల్ శాంతి పురస్కారంతో వచ్చిన రూ.1.3కోట్లను నమామి గంగే పథకం కింద గంగా నది శుభ్రత కోసం విరాళమిచ్చారు. ఇటీవల తన జ్ఞాపికలను వేలం వేయడం ద్వారా సమకూరిన రూ.3.40కోట్లు కూడా క్లీన్ గంగా మిషన్ కోసం విరాళంగా ఇచ్చారు. అలాగే 2015 వరకూ తాను స్వీకరించిన అన్ని బహుముతులను వేలం వేయడం ద్వారా సమకూరిన రూ.8.35కోట్లు కూడా గంగా మిషన్కు విరాళమిచ్చారు. గతంలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో అందుకున్న బహుమతులన్నింటిని వేలం వేయడం ద్వారా సమకూరిన రూ.89.96కోట్లు కన్యా కేలవని ఫండ్కు విరాళమిచ్చారు.
Recommended Video
కాగా,ఈ ఏడాది మార్చి 27న ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్కు ఐదు రోజుల వ్యవధిలోనే రూ.3,076 కోట్లు వచ్చినట్లు ఆడిట్ రిపోర్టులో వెల్లడైన సంగతి తెలిసిందే. రూ.2.25లక్షలతో మొదలైన ఈ నిధికి మార్చి 31 నాటికి రూ.3075.8కోట్లు విరాళం సమకూరిందని... ఇందులో రూ.39.6కోట్లు విదేశీ నిధులు ఉన్నాయని మొదటి ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు.