మోడీ స్వాతంత్ర్య దినోత్సవ స్పీచ్ ఎఫెక్ట్: భారత్తో కలిసి పనిచేస్తామంటూ చైనా శాంతి మంత్రం
బీజింగ్: ఇటీవల సరిహద్దులో ఉద్రిక్తలకు కారణమైన చైనా ఇప్పుడు శాంతి పాట పాడుతోంది. ఇందుకు ఆగస్టు 15న ఎర్రకోట వేదిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగమే కారణం కావడం గమనార్హం. పరోక్షంగా చైనా, పాకిస్థాన్ దేశాలకు మోడీ తన ప్రసంగంలో హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.
శాంతినే కోరతాం కానీ.. శత్రుదేశాలకు మోడీ వార్నింగ్..
తాము శాంతినే కోరుకుంటామని.. కయ్యానికి కాలు దువ్వితే తగిన గుణపాఠం చెప్పి తీరుతామని తేల్చి చెప్పారు. భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే పనులు చేస్తే మన జవాన్లు వారికి అదేరీతిలో జవాబిస్తారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రసంగంపై చైనా విదేశాంగ శాఖ తాజాగా, స్పందించింది. భారత్తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ తెలిపారు.
భారత్తో కలిసి పనిచేస్తామంటూ చైనా శాంతి మంత్రం
భారత్-చైనాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు. రెండు పొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయి. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందిస్తాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం ఇరుపక్షాలు ఒకరినొకరు గౌరవించుకొని, సహాయ సహకారాలు అందజేసుకోవాలి. ఇందుకు భారత్ తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని ఝావో స్పష్టం చేశారు.
ద్వైపాక్షిక సంబంధాలంటూ కొత్త పాట
అంతేగాక, రాజకీయంగా పరస్పర నమ్మకాన్ని పెంపొందించుకుని, ఇరువురి మధ్య నెలకొన్న విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుని, ద్వైపాక్షిక సంబంధాలను దృఢపర్చుకునేందుకు చైనా సంసిద్ధంగా ఉందని ఝావో లిజియాన్ స్పష్టం చేశారు. జూన్ 15న సరిహద్దులోని గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా బలగాలు కుట్రపూరితంగా దాడి చేసి 20 మంది మన జవాన్లను పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, మన జవాన్ల దాడిలో సుమారు 40 మందికిపైగా చైనా బలగాలు హతమైనట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే అమర జవాన్లను స్మరిస్తూ.. శత్రుదేశాలకు మోడీ వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగినా తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.