ఎన్డీయేకు మెజార్టీ తగ్గితే ప్రధానమంత్రిగా ఎవరంటే..: కేశవ్ ప్రసాద్ మౌర్య ఏం చెప్పారంటే?
లక్నో: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ ఎన్డీయే కూటమికి మెజార్టీ తగ్గినప్పటికీ నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారని ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య ఆదివారం అన్నారు. ఆయనకు సరితూగిన నేత లేడని అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో ఎన్డీయే కూటమికి గత 2014 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే 400 స్థానాల వరకు గెలుచుకుంటుందనిచెప్పారు. 2014లో 300 మార్క్ దాటామని, ఇప్పుడు మరింత పెరుగుతుందని చెప్పారు.
బీజేపీకి మెజర్టీ రాదని కట్టుకథలను ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ లాంటి కొందరు తమను తాము ప్రధాని అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. వీరి కలలను మోడీ పటాపంచలు చేస్తారని, మరోసారి ప్రధాని అవుతారన్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా కేంద్ర ప్రభుత్వం తొలగిస్తోందని చెప్పారు. సమయం వచ్చినప్పుడు అది కూడా పూర్తవుతుందని చెప్పారు. 2014లో తమకు ఒంటరిగా 282 సీట్లు వచ్చాయని, 2019లో ఒంటరిగా 300కు పైగా సీట్లు గెలుచుకుంటామని చెప్పారు. తమ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిసి 400 మార్క్ చేరుకుంటామన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇది సాధ్యమని చెప్పారు. ప్రజలు నరేంద్ర మోడీని నమ్ముతున్నారని, కాబట్టి ఆయనే తిరిగి అధికారంలోకి వస్తారని చెప్పారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరు తెరపైకి వస్తున్న నేపథ్యంలో జరుగుతోన్న ప్రచారంపై కేశవ ప్రసాద్ మౌర్య స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు మెజార్టీ తగ్గితే.. ఇతర పార్టీలతో కలిసి ఆరెస్సెస్కు దగ్గరగా ఉన్న నితిన్ గడ్కరీ పేరును పరిశీలిస్తారనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో కేశవ్ ప్రసాద్ స్పందించారు. మోడీకి తిరుగులేదని, ఆయన నాయకత్వంలో మరింత మెజార్టీ సాధిస్తామని చెప్పారు.