గుప్కర్ అలయన్స్ నేతలతో ప్రధాని భేటీ- ప్రత్యేకతలు, సైడ్లైట్స్ ఇవే
జమ్ముకశ్మీర్ భవిష్యత్తును తేల్చేందుకు ప్రధాని మోడీ నివాసంలో జరుగుతున్న భేటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఢిల్లీలోని లోక్కళ్యాణ్ మార్గ్లో ఉన్న ప్రధాని మోడీ అధికారిక నివాసంలో ఈ భేటీ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఈ భేటీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఈ భేటీలో పాల్గొంటున్న నేతలకూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం...
రెండేళ్ల క్రితం జమ్ముకశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత కేంద్రంతో అక్కడి రాజకీయ నేతలకు గతంలో ఉన్న సత్సంబంధాలు కాస్తా తెగిపోయాయి. ముఖ్యంగా అప్పటివరకూ మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని ప్రభుత్వంతో కలిసి సాగుతున్న బీజేపీ ఒక్కసారిగా ప్రభుత్వం నుంచి తప్పుకోవడమే కాకుండా ముఫ్తీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆమెను జైలుపాలు చేసింది. ఆ తర్వాత ఆమె తొలిసారిగా ప్రధాని మోడీతో చర్చలకు ఢిల్లీ వచ్చారు.
ప్రధాని మోడీతో జరుగుతున్న ఈ కీలక భేటీకి జమ్ముకశ్మీర్కు చెందిన నలుగురు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వీరంతా గతంలో ముఖ్యమంత్రులకుగా పనిచేయడమే కాకుండా రాష్ట్రంలో కీలక నేతలుగా, ప్రజాస్వామ్యవాదులుగా పేరుతెచ్చుకున్న వారే. వీరిలో మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఉన్నారు. వీరిలో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు కాగా.. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. అలాగే మెహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన వారు.
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు తర్వాత వివిధ పార్టీలకు చెందిన వీరంతా కలిసి గుప్కర్ అలయన్స్గా ఏర్పడ్డారు. పార్టీలు వేరైనా ఒకే వేదికపైకి వచ్చి కేంద్రంపై పోరాటం సాగిస్తున్నారు. ఇవాళ వీరంతా కలిసి తొలిసారి ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వచ్చారు. ఇదో ప్రత్యేకత కాగా.. ప్రధాని మోడీ వీరందరినీ పేరుపేరునా పలకరిస్తూ నమస్కరించారు. భేటీకి ముందు అందరు నేతల్ని యోగక్షేమాలు అడిగి సమావేశం ప్రారంభించారు. దీంతో నిన్న మొన్నటి వరకూ కేంద్రంపై నిప్పులు చెరిగిన వీరంతా ప్రధాని మోడీకి ప్రతినమస్కారాలు చేస్తూ ఉల్లాసంగా కనిపించారు.