మోడీ సోదరుడి కుమార్తె కూడా చైన్ స్నాచర్ బాధితురాలే: 50వేల నగదు, 2ఫోన్లు చోరీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఇటీవల కాలంలో గొలుసు దొంగతనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా, సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడి కుమార్తె కూడా గొలుసు దొంగలబారిన పడటం గమనార్హం. మోడీ సోదరుడి కుమార్తె అయిన దమయంతి బెన్ మోడీ పర్సును లాక్కుపోయారు ద్విచక్ర వాహనంపై వచ్చిన చైన్ స్నాచర్లు.
ఈ ఘటన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి సమీపంలోని గుజరాతీ సమాజ్ భవన్ హోటల్ గేటు బయట జరగడం గమనార్హం. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ప్రధాని మోడీ సోదరుడి కుమార్తె దమయంతి బెన్ మోడీ శనివారం ఉదయం అమృత్సర్ నుంచి ఢిల్లీకి వచ్చారు. సివిల్ లైన్స్ ప్రాంతంలోని గుజరాతీ సమాజ్ భవన్లో ఒక గదిని బుక్ చేసుకున్నారు.
ఆమె హోటల్ బయటకు వస్తున్న క్రమంలో గేటు వద్దకు చేరుకోగానే ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు చైన్ స్నాచర్లు ఆమె పర్సును లాక్కుని పరారయ్యారు. కాగా, ఆ పర్సులో రూ. 56,000 నగదుతోపాటు రెండు మొబైల్ ఫోన్లు, ఇతర కీలక పత్రాలు ఉన్నాయి. అంతేగాక, తిరుగు ప్రయాణానికి సంబంధించిన విమాన టికెట్లు కూడా ఉన్నాయని వాపోయారు దమయంతి.
ఈ మేరకు ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. కాగా, ఇటీవల కాలంలో చైన్ స్నాచర్ల బెడద పెరిగిపోవడంతో ఢిల్లీలోని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.