ప్రజలను విడగొట్టడం, ద్వేషం వ్యాప్తి చేయడమే విధి, ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ ధ్వజం
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోడీ విధి ప్రజలను విడగొట్టడం, ద్వేషం వ్యాప్తి చేయడమేనని విమర్శలు చేశారు. భరతమాత అధికారాన్ని మోడీ నాశనం చేస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లాంటి పనులు తుగ్లక్ నిర్ణయాలు అని మండిపడ్డారు. అసోంలోని గౌహతిలో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
ముస్లింలకు ఎందుకు వద్దు...
నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టాక అసోం ప్రజలు వివిధ సమస్యలపై నిరసనలు చేపడుతూనే ఉన్నారని రాహుల్ గుర్తుచేశారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ చట్టంపై ఆందోళనలు చేపట్టారని పేర్కొన్నారు. ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలకు ఎందుకు పౌరసత్వం ఇవ్వరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
2 కోట్ల మంది
మీ హయాంలో ఎంతమందికి అస్సామీలకు ఉద్యోగం కల్పించారు అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల మందికి ఉద్యోగం కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అడిగారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మీ కష్టార్జితం కోసం క్యూ లైన్లలో నిల్చుంటే.. ప్రధాని మోడీ మాత్రం రూ.1.40 లక్షల కోట్ల పెద్దల రుణాలను మాఫీ చేశారని విమర్శించారు. దేశ ప్రజలను విభజించి, వారి నగదును పెద్దలకు పంచి పెడుతున్నారని మండిపడ్డారు.
చెలరేగిన హింస..
సీఏఏను వ్యతిరేకిస్తూ గత మూడు వారాలుగా ప్రజలు ఆందోళన చేపడుతున్న వినేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే అసోంలో హింస చెలరేగుతోందని ఎన్నికల సమయంలో తాను చెప్పానని గుర్తుచేశారు. ఆ రోజు తాను చెప్పిన అంశాలు రుజువయ్యాయని తెలిపారు. అస్సామీలపై మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. అసోం ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను దెబ్బతీయేద్దని మోడీని రాహుల్ గాంధీ కోరారు.
ఉపాధి కల్పన
అసోంలో యువత ఉద్యోగాల గురించి ముఖ్యమంత్రి సోనోవాల్ మాట్లాడరని రాహుల్ అన్నారు. గత 40 ఏళ్లలో నిరుద్యోగిత పెరిగిపోయిందని చెప్పారు. ఉపాధి కల్పనపై మాట్లాడేందుకు సోనోవాల్కు నోరు రాదని చెప్పారు. ఆరెస్సెస్ చెప్పకుండా బీజేపీ సీఎం సోనోవాల్ సొంతంగా నిర్ణయం తీసుకోగలరా అని రాహుల్ ప్రశ్నించారు. అస్సామీలను ఇక్కడి వారే పాలించాలే తప్ప.. నాగ్పూర్ చెడ్డీవాలా కాదని పేర్కొన్నారు.