మోడీ పకోడా ఐడియా: కాంగ్రెస్ కార్యకర్త జీవితం మార్చేసింది, 35బ్రాంచీలు పెట్టేశాడు
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ గత కొంత కాలం క్రితం ఒక టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'పకోడాలు(పకోడీలు) అమ్ముకోవడం ద్వారా కూడా ఉపాధి పొందవచ్చని చెప్పిన విషయం తెలిసిందే.
అయితే మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీతోపాటు విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఉద్యోగాలివ్వమంటే ఉచిత సలహాలిస్తున్నారంటూ మండిపడ్డాయి. కానీ, మోడీ ఇచ్చిన 'పకోడా' సలహా ఓ కాంగ్రెస్ కార్యకర్త జీవితాన్ని మార్చేయడం గమనార్హం.
మోడీ పకోడా ఐడియాతో..
ఆ వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు చెందిన నారాయణభాయ్ రాజ్పుత్ హిందీ లిటరేచర్లో పోస్టు గ్రాడ్యూయేట్. కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని అయిన అతడు ఎన్ఎస్యూఐలో కార్యకర్తగా చేరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. అయితే పీజీ చేసిన నారాయణభాయ్కి ఎలాంటి ఉద్యోగంలేదు. ఈ క్రమంలో మోడీ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూను అతడు కూడా చూశాడు. మోడీ చెప్పిన ‘పకోడా ఐడియా' అతనికి బాగా నచ్చింది. పనిపాటా లేకుండా ఖాళీగా ఉండటం కంటే పకోడా అమ్మడం మంచిదని భావించాడు.
ఒకటి పెట్టేసి.. 35బ్రాంచీలుగా విస్తరణ
వెంటనే పకోడా స్టాల్ ప్రారంభించాడు. అది బాగా లాభాలు తెచ్చిపెడుతుండటంతో వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నాడు. ఒక స్టాల్తో ప్రారంభమైన నారాయణభాయ్ పకోడా వ్యాపారం ఇప్పుడు మొత్తం 35శాఖలుగా, వడోదర నగరమంతా విస్తరించడం గమనార్హం.
మోడీ ఐడియా మార్చేసిందంటూ నారాయణభాయ్..
ఈ సందర్భంగా నారాయణభాయ్ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని ‘పకోడా బిజినెస్ ఐడియా' విన్న తర్వాత నేను ఎందుకు ఆ మార్గంలో వెళ్లకూడదు అనుకున్నాను. నిరుద్యోగిగా ఉండటం కంటే పకోడా అమ్మి రోజుకు కనీసం 200 రూపాయలు సంపాదించడం మంచిదే కదా అనిపించింది. అందుకే ఒకసారి ప్రయత్నించి చుద్దామని భావించాను. మొదట 10 కేజీల పదార్థాలతో, 100 గ్రాముల పకోడా ఒక్కొక్కటిగా 10 రూపాయలుగా ఒక స్టాల్ను ప్రారంభించాను. నేడు నగరవ్యాప్తంగా నా పకోడా స్టాల్స్ 35 ఉన్నాయి. ప్రతిరోజు 500 - 600 కేజీల పకోడాలు అమ్ముతున్నాను' అని పేర్కొన్నాడు.
నాకు, రాహుల్కు కూడా మోడీనే ప్రధాని
కాగా, తనతోపాటు రాహుల్ గాంధీకి కూడా నరేంద్ర మోడీ ప్రధానియేనని, అందుకే మోడీ ఇచ్చిన సలహాను సీరియస్గా తీసుకున్నానని తెలిపాడు. అయితే, తాను కాంగ్రెస్ పార్టీకి అభిమానిగానే ఉంటానని అన్నారు. వ్యాపారం ప్రారంభించిన రెండు నెలల్లోనే నారాయణభాయ్ పకోడా వ్యాపారానికి మంచి గుర్తింపు వచ్చింది. నారాయణభాయ్ రోజు ఉదయం 7 - 11 గంటల వరకూ అలానే సాయంత్రం కూడా ఇదే సమయంలో పకోడాలు అమ్ముతుంటాడు.