ఇంకా సహనం ఎందుకు?: మోడీపై శివసేన
ముంబై: ఉగ్రవాద ఘటనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇంకా సహనంగా ఉండటానికి ముగింపు చెప్పాలని శివసేన పార్టీ సూచించింది. పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఆ పార్టీ పై విధంగా స్పందించింది.
తన పత్రిక సామ్నాలో ఈ మేరకు పార్టీ సంపాదకీయాన్ని రాసింది. పఠాన్కోట్ దాడి లాంటి ఘటనలపై ప్రధాని మోడీ స్పందించాలని, దేనికైనా హద్దులు ఉంటాయని రాసింది. ఇప్పటి వరకు ఇలాంటి ఘటనల పట్ల దేశం చాలా సహనంగా ఉంటూ వచ్చిందని తెలిపింది.
పఠాన్కోట్ విషయంలో అమెరికా ఇప్పటికే పాకిస్థాన్పై ఒత్తిడి తెస్తోందని పేర్కొంది. ‘ఇప్పుడు బంతి పాకిస్థాన్ కోర్టులో ఉండటంతో ఏం జరుగుతుందో చూడాలి' అదొక్కటే మన చేతుల్లో ఉందని శివసేన పేర్కొంది.
ఈ దాడికి ప్రతిగా గట్టి సమాధానం ఇవ్వాలని సూచించింది. ఇప్పుడు రాజధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదని, అలాంటి సిద్ధాంతాల్ని పక్కనబెట్టి శత్రువులకు ధీటైన సమాధానం ఇవ్వాలని కోరింది.
రష్యా, ఫ్రాన్స్, అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలు తమ శత్రు దేశాలకు ఘాటైన సమాధానం చెబుతాయని, వారి కోర్టులో బంతి వేయడం లాంటివి ఉండవని పేర్కొంది. భారత్పై మాత్రమే ఒత్తిడి ఎందుకు ఉంటుందని ప్రశ్నించింది.