‘బీజేపీ ఎమ్మెల్యేలం.. ఎంపీలం అంటే చితక్కొడతారు’
బెంగళూరు: బీహార్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ బీహార్కు అండగా ఉంటామంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో అధికరంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, అధికార పార్టీ నేతలకు శరాఘాతంలా మారింది.
బీహార్ వరదల్లో చిక్కుకున్న డిప్యూటీ సీఎం.. సురక్షిత ప్రాంతానికి తరలించిన ఎన్డీఆర్ఎఫ్
సౌత్ ఇండియా అవసరం లేదా?
ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక గురించి పట్టించుకోకపోతే దక్షిణ భారతదేశంలో బీజేపీ పట్టు కోల్పోతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యాత్నాల్ హెచ్చరించారు. 25 ఎంపీలను ఇచ్చిన కర్ణాటకను నిర్లక్ష్యం చేయడం పార్టీకి మంచిది కాదని హితవు పలికారు.
అండగా ఉంటామంటూ ప్రధాని..
బీహార్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జనవజీవనం అస్తవ్యస్తమైంది. 29మందికిపైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో మాట్లాడాను. బీహార్ ప్రజలకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
25 ఎంపీలను ఇస్తే మాకిలాంటి పరిస్థితా?
ఈ ట్వీట్ కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రతిపక్ష నేతలు ప్రధానితోపాటు రాష్ట్ర ప్రభుత్వంపైనా విమర్శలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో భారీ వరదలు వచ్చిన సమయంలో ప్రధాని ఎందుకు ఇలా స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. నెటిజన్లు కూడా మోడీ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ కర్ణాటకపై ఎందుకింత నిర్లక్ష్యం అంటూ ప్రశ్నిస్తున్నారు. 25 ఎంపీలను గెలిపిస్తే ఇలా వ్యవహరిస్తారా? అంటూ నిలదీస్తున్నారు.
బీజేపీ ఎమ్మెల్యేలం, ఎంపీలమంటే చితక్కొడతారు..
ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఎన్నికలు లేని కారణంగానే మోడీ కర్ణాటక రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ బీజేపీ ఎమ్మెల్యే వాటికి నేను ఏం సమాధానం చెప్పాలి. కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితుల గురించి బీజేపీ ఎంపీలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలి. అలా జరగకపోతే బీజేపీ ఎమ్మెల్యేలం, ఎంపీలం అని జనం వద్దకు వెళితే చితక్కొడతారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు బసనగౌడ.
మేం మీకు పట్టదా???
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించాలని పార్టీకి, ప్రభుత్వానికి సూచించారు ఈ విజయపుర బీజేపీ ఎమ్మెల్యే. కాగా, ఆగస్టు నెలలో కర్ణాటక రాష్ట్రంలో భారీగా వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక సాయం చేస్తామంటూ ఎందుకు ప్రకటించలేదని కర్ణాటక ప్రతిపక్ష నేతలతోపాటు నెటిజన్లు నిలదీస్తున్నారు.