మోడీ పాస్పోర్ట్ వివరాలు అడిగిన భార్య జశోదాబెన్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాస్పోర్ట్ వివరాలు ఇవ్వాలని కోరుతూ ఆయన సతీమణి జశోదా బెన్ బుధవారం నాడు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా దరఖాస్తు పెట్టుకున్నారు. అహ్మదాబాద్లో గల ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో ఆమె ఈ అర్జీ చేశారు.
ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాస్పోర్ట్ తీసుకునే క్రమంలో సమర్పించిన అన్ని వివాహ సంభందిత పత్రాల గురించి ఆమె తెలుసుకోవాలనుకుంటున్నారు. గతంలో ఆమె 2015 నవంబర్లో దరఖాస్తు చేశారు.
కానీ మోడీతో ఆమె వివాహం జరిగినట్లుగా పెళ్లి సర్టిఫికెట్ను సమర్పించని కారణంగా అధికారులు దరఖాస్తును తిరస్కరించారు. కాగా తాజాగా ఆమె మరోమారు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశారు. సమాధానం చెప్పేందుకు అధికారులు కొంత వ్యవధి తీసుకోనున్నారని తెలుస్తోంది.
కాగా, జశోదా బెన్ పిటిషన్కు తాము నిర్ణీత 30 రోజులలో సమాధానం చెబుతామని రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ జెడ్ఏ ఖాన్ చెప్పారు. జశోదాబెన్ స్కూల్ టీచర్గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆమె తన సోదరుడు అశోక్ మోడీతో కలిసి మెహన్సా జిల్లాలోని ఉన్జాలో ఉంటున్నారు.