చౌకీదారంటే భయపడుతున్నారు.. అందుకే నన్ను..! మోడీ సెటైర్లు
ఆగ్రా : దేశానికి కాపలాదారుగా ఉన్న తనను చూసి ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు ప్రధాని మోడీ. తనకు అధికారం లేకుండా చేయడమే ప్రధాన ఎజెండాగా వారు ముందుకెళుతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటివారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో గంగాజల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఒకరి ముఖం మరొకరు చూసుకునేందుకు సైతం ఇష్టపడని నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతుండటం విచిత్రంగా ఉందన్నారు.
ప్రజలకు మేలు చేసే విధంగా వివిధ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 100 రోజుల్లో 7 లక్షల మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. దాదాపు 99 శాతం వస్తువులను 28శాతం జీఎస్టీ శ్లాబు నుంచి తగ్గించామని చెప్పారు. గంగా నది ప్రక్షాళన తమ ఎజెండాలో ఒకటని చెప్పిన మోడీ.. ఆగ్రాను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో ఒక అడుగు ముందుకు పడిందన్నారు.