Budget sessions:ఆర్థికపరమైన అంశాలను మాత్రమే చర్చిద్దామన్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. అంతకంటే ముందు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో ఆర్థికపరమైన అంశాలపై చర్చించాలని ప్రధాని కోరారు. 2020లో పార్లమెంటు తొలి సమావేశాలు జరుగుతున్నాయని అంతేకాకుండా ఈ దశాబ్దపు తొలి సమావేశాలని మోడీ చెప్పారు.
Recommended Video
దశాబ్దపు తొలి సమావేశాలను ఘనంగా ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. మంచి భవిష్యత్తు కోసం ఈ సమావేశాల్లోనే పునాది వేద్దామని ప్రధాని అన్నారు. ఈ సమావేశాల్లో ఇతర అంశాలను పక్కనబెట్టి ఆర్థిక పరమైన అంశాలను మాత్రమే చర్చిద్దామని విపక్షాలకు పిలుపునిచ్చారు మోడీ. ఉభయ సభలు ఆర్థికపరమైన అంశాలపై ఆర్థిక ప్రగతిపై ఆరోగ్యవంతమైన చర్చ చేపట్టాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారికత , వెనకబడిన వర్గాల ఉన్నతి కోసం ఈ దశాబ్దంలో పాటుపడతామని ప్రధాని మోడీ అన్నారు. ఈ రెండు అంశాలపై దృష్టి కేంద్రీకరించినట్లు ప్రధాని అన్నారు.
Speaking at the start of the Budget Session of Parliament. https://t.co/CIMbUsXOVV
— Narendra Modi (@narendramodi) January 31, 2020
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు కూడా తన నివాసంలో రాజ్యసభ నేతలతో సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనుంది. అనంతరం బడ్జెట్పై చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 11 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి. అనంతరం రెండో విడత సమావేశాలు మార్చి 2 నుంచి ఏప్రిల్ 3వరకు జరుగుతాయి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో పార్లమెంటు ఆవరణలో సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నిరసన తెలిపింది. సేవ్ ఇండియా అంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శించారు.