పాఠశాల విద్యార్థులకు భోజనం వడ్డించిన మోడీ..
లక్నో: ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం మధ్యాహ్నం..కొందరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దగ్గరుండి భోజనాన్ని వడ్డించారు. కొసరి, కొసరి ఆహార పదార్థాలను వారి ప్లేట్లలో వేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని వృందావన్ లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఇస్కాన్ ప్రతినిధులతో కలిసి, నరేంద్రమోడీ.. భోజనాన్ని వడ్డించారు. ప్లేట్ పట్టుకుని తన వద్దకు వచ్చిన విద్యార్థితో కొద్దిసేపు ముచ్చటించారు. పేరు, చదువు, తరగతి వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. వారి భుజాన్ని తడుతూ, బాగా చదువుకోవాలని ప్రోత్సహించారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాల్లో ఈ పథకం అమలు బాధ్యతను ఇస్కాన్ స్వీకరించింది. అక్షయపాత్ర పేరుతో స్వచ్ఛందంగా మధ్యాహ్న భోజనాన్ని వండి, విద్యార్థులకు సరఫరా చేస్తోంది.
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వృందావన్ పరిధిలో కూడా ఎంపిక చేసిన కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇస్కాన్ మధ్యాహ్న భోజనాన్ని చేరుస్తోంది. దేశవ్యాప్తంగా వారు చేపట్టిన ఈ కార్యక్రమం.. సోమవారం నాటికి 300 కోట్ల భోజనాలకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇస్కాన్ ఓ సదస్సును ఏర్పాటు చేసింది. వృందావన్ చంద్రోదయ మందిర్ ఆవరణలో అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని హాజరయ్యారు. 20 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు.
అంతకుముందు- ప్రధాని అక్షయపాత్ర ఫౌండేషన్ సదస్సులో ప్రసంగించారు. విద్యార్థులకు శుభ్రమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, తాము అదే పని చేస్తున్నామని అన్నారు. చిన్న పిల్లలకు ఉచితంగా టీకాలను అందజేయడానికి తాము అమలు చేస్తోన్న రెయిన్ బో పథకం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని, పలువురు ప్రముఖ వైద్యులు దీన్ని ప్రశంసించారని చెప్పారు. ఈ పథకం కింద తాము దేశవ్యాప్తంగా చిన్నారులక 12 రకాల టీకాలను అందిస్తున్నామని మోడీ చెప్పారు.
Prime Minsiter Narendra Modi, CM Yogi Adityanath and Governor Ram Naik serve food to children in Vrindavan pic.twitter.com/WyJGfxkjpW
— ANI UP (@ANINewsUP) February 11, 2019
ఈ పథకాన్ని అమలు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా మూడు కోట్ల 40 లక్షల మంది చిన్నారులు, 90 లక్షల మంది గర్భిణులకు టీకాలు వేశామని అన్నారు. 1500 మంది విద్యార్థులతో ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం.. ఇప్పుడు 17 లక్షలకు చేరుకుందని, రోజూ లక్షల మంది పేద విద్యార్థులకు కడుపు నింపుతున్నదని అన్నారు. పేద విద్యార్థులక పౌష్టికాహారాన్ని అందించడానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.
ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇస్కాన్..అక్షయపాత్ర ఫౌండేషన్ ను ఏర్పాటు చేసిందని ప్రశంసించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖతో కలిసి సంయుక్తంగా పని చేస్తోందని మోడీ అన్నారు. ఇలాంటి సంస్థలు మరిన్ని ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఓ సంస్థ స్వచ్ఛందంగా చేపట్టిన కార్యక్రమం.. 300 కోట్ల భోజనాలకు చేరుకోవడం గర్వించదగ్గ విషయమని అన్నారు.
ఇస్కాన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఫౌండేషన్ అక్షయపాత్ర. 19 సంవత్సరాల కిందట బెంగళూరు కేంద్రంగా ఈ ఫౌండేషన్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. లాభాపేక్ష లేకుండా.. మధ్యాహ్న భోజన పథకం అమలు బాధ్యతను స్వీకరించింది. ప్రభుత్వం నుంచి అందే నిత్యావసర సరుకులను తీసుకుని.. తాము సొంతంగా నిర్మించిన భవనాల్లో భోజనాన్ని వండి, ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తుంది. దేశవ్యాప్తంగా 14,702 పాఠశాలలకు అక్షయపాత్ర భోజనాన్ని సరఫరా చేస్తోంది.