మ్యాన్ వర్సెస్ వైల్డ్ :18వ సంవత్సరంలోనే ఇళ్లు విడిచి హిమాలయాలకు వెళ్లిన నరేంద్రమోడీ...!
సోమవారం డిస్కవరీ చానల్లో ప్రసారమైన మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సంఘటనలను సాహసికుడు బేర్ గ్రిల్స్తో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే బేర్ గ్రిల్స్తో కలిసి ప్రయాణించిన మోడీ, తాను 18వ సంవత్సరంలోనే ఇళ్లు విడిచి హిమాలయాలకు వెళ్లినట్లు చెప్పారు. అప్పుడే ఆధ్యాత్మిక జీవనాన్ని గడపాలని అనుకున్నట్టు తెలిపారు. ఇక అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించాలని భావించినట్టు తెలిపారు. అనంతరం అక్కడి ప్రజలతో గడిపానని,వారి నుండి చాల నేర్చుకున్నానని చెప్పారు.
చాయ్ దుకాణాన్ని ఎలా నడిపారో తెలిపిన మోడీ
ఇక తన చిన్ననాటీ జ్ఝాపకాలను కూడ బేర్ గ్రిల్స్తో పంచుకున్నారు. ఈనేపథ్యంలోనే సౌకర్యవంతమైన బాల్యజీవితాన్ని గడపలేదని తెలిపారు. కాగా స్కూల్కు వెళ్లే సమయంలో ఐరన్ బట్టలు లేకుండా వెళ్లేవారని, దీంతో వేడి చేసిన పాత్రతో ఐరన్ చేసుకునేవాడినని తెలిపారు. మరోవైపు చిన్నప్పుడు చాయ్ దుకాణాన్ని ఎలా నడిపారో కూడ వివరించారు.
చిన్నప్పుడే ముసలిని పట్టుకున్నాను
చిన్నప్పుడు ప్రతిరోజు చెరువులో స్నానం చేశారని తెలిపిన మోడీ, చెరువు తప్ప స్నానం చేసేందుకు వేరే మార్గం లేదని వివరించారు. కాగా ఓ రోజు చెరువులో స్నానం చేస్తున్నప్పుడు చెరువులో మొసలి పిల్ల కనిపించిందని, దాంతో మొసలి పిల్లను పట్టుకుని ఇంటికి తీసుకువెళ్లవడంతో మోడీ అమ్మ వారించిందని మొసలి పిల్లను తల్లి నుండి వేరు చేయవద్దని తెలిపిందని, దీంతో పాటు మొసళ్లను ఇళ్లలో పెంచలేమని చెప్పిందని వివరించారు. దీంతో మొసలి పిల్లను తిరిగి చెరువులోనే వదిలిపెట్టినట్టు చెప్పారు.
మోడీ సాహసాన్ని ప్రశంసించిన బేర్ గ్రిల్స్
మోడీ సాహసంపై బేర్ గ్రిల్స్ ప్రశంశల జల్లు కురిపించాడు. ముఖ్యంగా అడవిలో సంచరిస్తున్నప్పుడు జంతువుల ప్రమాదాల గురించి అడిగిన నేపథ్యంలోనే మోడీ సమాధానం చెప్పారు. అటవీ ప్రాంతాలను ప్రమాద ప్రాంతలుగా తాను గుర్తించనని, ప్రజలు ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్లినప్పుడే అది ప్రమాదకరంగా మారుతుందని చెప్పిన ఆయన, ప్రకృతికి సహకరించినప్పుడు అది మనకు సహకరిస్తుందని తెలిపారు. ఇక 18 సంవత్సరాల తర్వాత తొలిసారిగా సెలవు తీసుకున్నట్లు మోడీ తెలిపారు. ఈ ఎపిసోడ్ మొత్తాన్నీ ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో చిత్రీకరించారు.