భారత్-బంగ్లాదేశ్ మధ్య రైలు సర్వీస్: ఎక్కడి నుంచి ఎక్కడికి?: విజయ్ దివస్కు గుర్తుగా
న్యూఢిల్లీ: పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇదివరకు భారత్-పాకిస్తాన్ మధ్య సంఝౌతా ఎక్స్ప్రెస్ బస్ సర్వీస్ను నడిపించిన తరహాలోనే.. ఈ సారి రైలు సర్వీస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈ రైలు నడవబోతోంది. భారత్, బంగ్లాదేశ్ ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, షేక్ హసీనా కొద్ది సేపటి కిందటే ఈ రైలు సర్వీస్ను ప్రారంభించారు. రెండు దేశాల ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా రైలు సర్వీస్ను ప్రవేశపెట్టారు.
Recommended Video
రెండు దేశాల మధ్య రైల్ లింక్..
పశ్చిమ బెంగాల్లోని హల్దీబరి, బంగ్లాదేశ్లోని చిలహతి స్టేషన్ల మధ్య ఈ రైలు నడుస్తుంది. అంతర్జాతీయ సరిహద్దుకు ఆనుకుని ఉండే పట్టణాలు ఇవి. పాకిస్తాన్ నుంచి విముక్తి పొంది 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రైలు సర్వీస్ను ప్రారంభించారు. 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధం ముగిసి బుధవారం నాటితో 50 సంవత్సరాలు పూర్తయిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే ఆ ఇద్దరు నేతలు..వర్చువల్ విధానంలో సమావేశం అయ్యారు. అనేక అంశాలపై వారిద్దరు చర్చించారు. దౌత్య, ద్వైపాక్షిక ఒప్పందాల గురించి మాట్లాడారు. కొన్ని ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
దౌత్య సంబంధాలు మరింత బలోపేతం..
ఈ రైలు సర్వీస్ను అందుబాటులోకి తీసుకుని రావడంతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. తాను ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచీ పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించడంపై దృష్టి సారించానని అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పొరుగు దేశాలతో సన్నిహితంగా ఉన్నప్పుడే భారత్ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతుందని వ్యాఖ్యానించారు.
విజయ్ దివస్ మరునాడే..
తాము చేపట్టిన పొరుగు దేశాల విధానంలో బంగ్లాదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోడీ అన్నారు. విజయ్ దివస్ను భారత్.. ఘనంగా నిర్వహించుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు పొరుగు దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ మహమ్మారి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు.
ఢాకా రావాలని మోడీకి ఆహ్వానం..
వచ్చే ఏడాది మార్చిలో తాము 50వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తాము జరుపుకోనున్నామని షేక్ హసీనా తెలిపారు. రాజధాని ఢాకాలో వచ్చే ఏడాది మార్చి 26వ తేదీన నిర్వహించబోయే ఈ మహోత్సవానికి హాజరు కావాలని నరేంద్ర మోడీకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు.. బంగ్లాదేశ్ జాతిపిత, బంగబంధుగా గుర్తింపు పొందిన షేక్ ముజీబుర్ రెహ్మాన్ స్మారక పోస్టల్ స్టాంప్ను ఉమ్మడిగా ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మాగాంధీ, ముజీబుర్ రెహ్మాన్ల పేరు మీద ఏర్పాటు చేసిన బంగబంధు-బాపూ డిజిటల్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు.