‘భారత్ మాతా కీ జై’ అనడం కూడా సమస్యే: మన్మోహన్ సింగ్పై మోడీ విమర్శలు, ఎంపీలకు శాంతి మంత్రం
న్యూఢిల్లీ: భారత్ మాతా కీ జై, జాతీయవాదంను దర్వినియోగ చేస్తున్నారంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. భారత్ మాతా కీ జై అనే నినాదం చేయడం కూడా కొందరికి సమస్యగా మారిందని చురకలంటించారు.
కొందరికి భారత్ మాతా కీ జై అనడం కూడా సమస్యే..
బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఇంతకు ముందు కొంతమంది ‘వందేమాతరం'ను వ్యతిరేకించారని, ఇప్పుడు భారత్ మాతా కీ జై అనడాన్ని కూడా అడ్డుకుంటున్నారని మన్మోహన్ సింగ్ పేరెత్తకుండానే అన్నారు. స్వాతంత్ర ఉద్య సమయంలో కూడా కొందరు భారత్ మాతా కీ జై అనే నినాదాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని జవహర్ లాల్ నెహ్రూను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మనకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ప్రధాని. శాంతి, ఐకమత్యం అనేది అభివృద్ధికి బాటలు వేస్తాయన్నారు. అభివృద్ధే మన మంత్రమని వ్యాఖ్యానించారు. సమాజంలో శాంతియువత వాతావరణం కోసం ఎంపీలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొన్ని పార్టీలకు రాజకీయ అవసరాలే ముఖ్యమని.. కానీ, మన పార్టీకి మాత్రం జాతీయ ప్రయోజనాలే సుప్రీం అని దిశానిర్దేశం చేశారు.
దుర్వినియోగం చేస్తున్నారంటూ మన్మోహన్
గత వారం జవహర్ లాల్ నెహ్రూ ప్రసంగాలు, వ్యాసాలు, లేఖలతో కూడిన ఓ పుస్తకాన్ని ముద్రించారు ప్రొఫెసర్లు పురుషోత్తం అగర్వాల్, రాధా కృష్ణ. దీనికి ఎవరీ భారత మాతా? అనే శీర్షికను పెట్టారు. ఈ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. భారత్ మాతా కీ జై, జాతీయవాదంను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే ఒక ప్రజాస్వామ్య శక్తివంతమైన దేశంగా ఇండియాను గుర్తించాలని తొలి ప్రధాని ఆకాంక్షించారని, అందుకోసం ఆయన కృషి చేశారని చెప్పారు మన్మోహన్. ప్రజాస్వామ్య పద్ధతిలో దేశం నడవాలని జవహర్ లాల్ కోరుకున్నారని, ఆయన అలాగే పాలన కొనసాగించారని తెలిపారు. చారిత్రక, ఆధునిక భారతదేశానికి తగిన ప్రాధాన్యత ఇచ్చి తొలి ప్రధాని గర్వంగా నిలిచారని వ్యాఖ్యానించారు.
Recommended Video
‘ఎవరీ భారత మాతా?'..
నెహ్రూ కలలు కన్న ఇండియా ఇప్పుడు లేదని మన్మోహన్ అన్నారు. చరిత్రను చదివే ఓపిక లేని కొందరు నెహ్రూను తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అయితే, చరిత్ర ఆ ఆరోపణలను తిప్పికొడుతుందని అన్నారు. జాతీయవాదం, భారత్ మాతాకీ జై అనే నినాదాలు తప్పుగా ఉపయోగించి పౌరుల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. అసలు ఎవరీ భారతమాత? ఎవరి విజయం మీరు కోరుకుంటున్నారు? అని జవహర్ లాల్ నెహ్రూ ఒకసారి వ్యాఖ్యానించారని చెప్పారు. ఇండియా అంటే పర్వతాలు, నదులు, అడవులు, పొలాలు అందరికీ ప్రియమైనవే.. కానీ ప్రజలనే పరిగణలోకి తీసుకుంటారని ఆయన చెప్పారని తెలిపారు. నిజమైన ప్రజాస్వామ్యానికి, మంచి రాజకీయాలకు నెహ్రూ బాటలు వేశారని చెప్పారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, మళ్లీ రావాలని అన్నారు.