అవిశ్వాసం ఎందుకంటే? హగ్ ఇచ్చి.. : రాహుల్పై మోడీ సెటైర్లు, కమలంపై బురద జల్లితే..
షాజహాన్పూర్: అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారని తాము ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడంలో విఫలమై ఓ అనవసరమైన కౌగిలింత ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీనుద్దేశించి చురకలంటించారు. ప్రతిపక్షం ప్రధాని కుర్చీ కోసం మాత్రమే చూస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.
శనివారం ఉత్తర్ప్రదేశ్లోని రోజా ప్రాంతంలో నిర్వహించిన 'కిసాన్ కళ్యాణ్ ర్యాలీ'లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
'ప్రధాని కుర్చీ కోసమే ప్రతిపక్షం వెంపర్లాడుతోంది. ఆ విషయం నిన్న లోక్సభలో నిరూపితమైంది. వాళ్లు దేశం కోసమో లేదా దేశంలోని పేద ప్రజల కోసమో పోరాడటం లేదు. ప్రధాని కుర్చీ కోసం పేదలు, యువత, రైతులను పూర్తిగా మరిచిపోయారు. నాలుగేళ్లుగా మీకోసం నేను సేవలను అందిస్తూ ఉన్నాను. ఏదైనా తప్పు చేశానా? నేను కేవలం పేదల కోసం, దేశం కోసం మాత్రమే పని చేస్తున్నాను' అని మోడీ చెప్పారు.
Ahankaar, dambh aur daman ke sanskar aaj ka yuva Bharat sahne ko tayyar nahi hai. Chahe cycle ho ya haathi koi bhi ho saathi, svaarth ke iss poore swaang ko desh samajh chuka hai: PM Narendra Modi in Roza, Shahjahanpur pic.twitter.com/vSzxBh2aul
— ANI UP (@ANINewsUP) July 21, 2018
'అవినీతికి వ్యతిరేకంగా పోరాడటమే నేను చేసిన నేరం. నిన్న పార్లమెంటు వేదికగా మాపై అపనమ్మకం కలగడానికి కారణమేమిటని నేను ప్రశ్నించాను. అందుకు సమాధానం ఇవ్వడంలో విఫలమై.. అనవసరమైన కౌగిలింత ఇచ్చారు' అని మోడీ రాహుల్పై విమర్శలు గుప్పించారు.
ప్రతిపక్షాలు ఏకమవడంపైనా ఆయన విమర్శలు చేశారు. బురద ఎంత ఎక్కువగా ఉంటే అంతగా కమలం వికసిస్తుందని ఆయన తెలిపారు. అహంకారానికి, అణచివేతకు దేశంలో స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. పేద ప్రజలకు అండగా ఉన్నది, రైతులను ఆదుకున్నది తమ ప్రభుత్వమేనని మోడీ తెలిపారు.