పటేళ్ల రణన్నినాదం: మోదీ హవా వర్సెస్ హర్దిక్ ప్రతిన
సూరత్లో పాటిదార్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆసుపత్రి ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోడీ మాట్లాడిన తీరు దేశీయంగా, విదేశాల్లోని పటేళ్లకూ సందేశాన్నిస్తున్నది.
న్యూఢిల్లీ: ఒకవేళ ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలంటే అధికార బీజేపీ తప్పనిసరిగా పటేళ్లు, పాటిదార్ల మనస్సులు చూరగొనాల్సిన అవసరం తప్పనిసరి అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సూరత్లో పాటిదార్ల ఆధ్వర్యంలోని ట్రస్ట్ నిర్మించిన ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరైన ప్రధాని నరేంద్రమోడీ ఆ అవకాశాన్ని చక్కగానే వినియోగించుకున్నారని అనిపిస్తున్నది.
గుజరాత్లోని పాటిదార్లు, పటేళ్లు ప్రస్తుతం హార్దిక్ పటేల్ అనే యువనేత సారథ్యంలో విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రభుత్వం ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలని చేపట్టిన ఆందోళన హింసాత్మకం కావడంతోపాటు ఆందోళనకారులను గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసిందన్న విమర్శలు ఉన్నారు. తమ మద్దతుతో గెలిచిన ప్రభుత్వం తమనే ఇబ్బందుల పాల్జేయడంతో బీజేపీకి వ్యతిరేకంగా పటేళ్లు, పాటిదార్లు రణన్నినాదంచేస్తున్నారు.
పటేళ్ల రిజర్వేషన్ పోరాటానికి నాయకత్వం వహించినందుకు దేశ ద్రోహం నేరాభియోగాలను ఎదుర్కొంటున్న హార్దిక్ పటేల్.. గుజరాత్ నుంచి బీజేపీని పెకలించి వేస్తానని ప్రతీన బూనారు. తదనుగుణంగానే గుజరాత్లోని విజయ్ రూపానీ ప్రభుత్వం.. హార్ధిక్ పటేల్ తదితరులపై తాజాగా ముందస్తు కేసుల నమోదులో బిజీబిజీగా ఉన్నది.
ఎనిమిది నెలల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మరో ఎనిమిది నెలల్లో జరుగనున్నాయి. 1998 నుంచి వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ.. మరోదఫా విజయం సాధించడం కోసం కట్టుదిట్టమైన ప్రణాళికతో పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు సొంత రాష్ట్రమైన గుజరాత్లో పార్టీ అధికారానికి దూరమయ్యేందుకు అనుమతించే అవకాశాలు చాలా తక్కువ. అందుకు అనుగుణంగానే వ్యూహ రచనలో మోడీ - అమిత్ షా జోడీ నిమగ్నమైందని తెలుస్తున్నది.
గుజరాత్ జనాభాలో పటేళ్లు 12 శాతం పైమాటే
మళ్లీ గుజరాత్లో బీజేపీ గెలుపొందాలంటే తొలుత పటేళ్లు, పాటిదార్ల మనస్సులను గెలుచుకోవాలి. 23 ఏళ్ల హార్దిక్ పటేల్ సారథ్యంలో రెండేళ్ల క్రితం ఓబీసీ కోటాలో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పాటిదార్ అనామత్ ఆందోళన్ సంస్థ.. బీజేపీకి వ్యతిరేకంగా రణన్నినాదం చేస్తోంది. రాష్ట్ర జనాభాలో 12 శాతానికి పైగా ఉన్న పటేళ్లు రాజకీయంగా, ఆర్థికంగా ఆధిపత్యం సాధించినా, సామాజికంగా మాత్రం వెనుకబడిన కులాల్లోనే ఉన్నారు. హార్దిక్ పటేల్ ఆందోళనకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని వివిధ సామాజిక వర్గాల మద్దతు, సంఘీభావం లభిస్తున్నది. ప్రత్యేకించి కైరీస్, బీహార్ లోని కుర్మీల మద్దతు లభిస్తున్నది. కుర్మీ సామాజిక వర్గానికి చెందిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ సహజంగానే హార్దిక్ పటేల్ ఉద్యమానికి సానుభూతి పరుడిగా ఉన్నారు. విదేశాల నుంచి, ప్రత్యేకించి అమెరికాలోని పటేళ్ల నుంచి హార్దిక్ పటేల్ ఆందోళనకు ఇతోధిక ఆర్థిక, హార్దిక మద్దతు లభిస్తున్నది.
సూరత్ సభలో మోదీ ఇలా
సూరత్లో పాటిదార్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆసుపత్రి ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోడీ మాట్లాడిన తీరు దేశీయంగా, విదేశాల్లోని పటేళ్లకూ సందేశాన్నిస్తున్నది. మెచ్చుకోదగ్గ ఆసుపత్రి నిర్మించిన ట్రస్ట్ తీరు అభినందనీయమని పేర్కొంటూనే హిందీలో ప్రసంగించారు. ప్రధాని మోడీ గుజరాత్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు గుజరాతీలోనే మాట్లాడే వారు. తానిప్పుడు గుజరాతీలో మాట్లాడాలా? హిందీలో మాట్లాడాలా? అన్న విషయమై గందరగోళానికి గురవుతున్నానని పేర్కొన్నారు. కానీ ఈ దఫా హిందీ ఎంచుకోవడానికి ఒక కారణం చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలో సాధించిన విజయాలు బయటి ప్రపంచానికి తెలియాలంటే హిందీలోనే మాట్లాడాలని చెప్పారు. తద్వారా గుజరాతీల మనస్సులు చూరగొనేందుకు ప్రయత్నించారు.
మోదీ, అమిత్ షాలకు సొంత రాష్ట్రం గుజరాత్
ఇక్కడ మరో గమ్మత్తయిన అంశమేమిటంటే దేశంలోనే అతి ఎక్కువ జనాభా గల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం బీజేపీకి కీలకమే. 403 స్థానాలు గల అసెంబ్లీతోపాటు పార్లమెంట్ ఉభయ సభల్లోకి అత్యధిక మంది సభ్యులను పంపుతున్న రాష్ట్రం కావడం దీనికి కారణం. అలాగే త్వరలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీకి ఉత్తరప్రదేశ్ ఫలితాల కంటే తక్కువేం కాదు. దీనికి కారణమేమిటంటే ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ.. అంతకుముందు గుజరాత్ సీఎం కావడంతోపాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా అదే రాష్ట్ర వాసి, ఎమ్మెల్యే కూడా. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైతే అధికార పార్టీగా బీజేపీకి, కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.
రాక్ స్టార్ను తలపించిన మోడీ రోడ్ షో
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీ శ్రేణుల్లో నైతిక స్థయిర్యంపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉన్నది. దీని ప్రభావం 2019 లోక్ సభ ఎన్నికలపైనా పడే అవకాశాలు లేకపోలేదు. సంఘ్ పరివార్కు ప్రయోగశాలగా ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీకీ ఆరెస్సెస్కు ఎంతో కీలకం. ఓటమి పాలైతే సంఘ్ పరివార్కు కూడా నష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆసుపత్రి ప్రారంభానికి ముందు 25 వేల మోటార్ బైక్లతో సూరత్ పట్టణంలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో నిర్వహిస్తున్న ప్రాంతాల్లో త్రీ డీ లేజర్ షోలు కూడా ఏర్పాటు చేశారు. ఎస్యూవీ వాహనం మధ్యలో నిలబడిన ప్రధాని మోడీ.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రోడ్ షో పొడవునా మోడీ, మోడీ, భారత్ మాతా కీ జై నినాదాలతో హోరెత్తింది.
గుజరాత్లో పటేళ్లే కీలకం
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జాతవేతర దళితులు, యాదవేతర ఓబీసీలతోపాటు అగ్ర కులాల మద్దతు సంపాదించడంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విజయం సాధించారు. కానీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలంటే పటేళ్లు - పాటిదార్ల మద్దతు లేకుండా కమలనాథులు విజయం సాధించడం కష్ట సాధ్యమే. సూరత్లో ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పునాదిగా చేసుకుని బీజేపీ అధ్య్షక్షుడు అమిత్ షా .. పాటిదార్లు, పటేళ్ల ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న హార్దిక్ పటేల్ను ఏకాకిని చేసేందుకు వ్యూహ రచనలో నిమగ్నమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.