సరిహద్దుల్లో సైనికులతో ప్రధాని మోడీ దీపావళి సంబరాలు- చైనా తీరుపై పరోక్ష విమర్శలు
సామ్రాజ్యవాదంతో ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటోందని, 18వ శతాబ్దం నాటి వక్రబుద్ధిని ఇది స్పష్టం చేస్తోందని ప్రధాని మోడీ చైనాను ఉద్దేశించి ఇవాళ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. జైసల్మేర్లోని లోంగేవాలా పోస్టు వద్ద సైనికులతో కలిసి ప్రధాని దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు, మీరు మంచు కప్పేసిన పర్వతాల్లో, ఎడారుల్లో కాపలా కాస్తున్నారు, మీతో కలిపి వేడుక చేసుకోకపోతే నా దీపావళి పూర్తి కాదంటూ ప్రధాని మోడీ సైనికులను ఉత్సాహపరిచారు.
చైనా రెచ్చగొడితే భారత్ తగిన జవాబు ఇస్తుందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పొరుగుదేశం వక్రబుద్ధి చూపిస్తోందని, అయినా తాము రాజీపడే ప్రశ్నే లేదన్నారు. భారత్ ఇతరులను అర్ధం చేసుకుంటుందని, ఇతరులు కూడా తమను అర్ధం చేసుకోవాలని కోరుకుటుందని మోడీ తెలిపారు. కానీ తమ సహనం పరీక్షిస్తే మాత్రం గట్టి జవాబు ఇవ్వక తప్పదన్నార. చైనాతో సరిహద్దుల్లో సుదీర్ఘ ప్రతిష్టంభన నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరిచుకున్నాయి.
భారత సైనికులు తమ సరిహద్దులను కాపాడకుండా ప్రపంచంలో ఏ శక్తీ కూడా ఆపలేదని మోడీ తెలిపారు. అలాంటి సవాలు ఎదురైతే మాత్రం భారత్ తమ బలాన్ని, రాజకీయ వ్యూహాలను అమలు చేయకతప్పదన్నారు. భారత్ ప్రయోజనాలకు విఘాతం కలిగితే ఎట్టిపరిస్ధితుల్లోనూ రాజీపడబోదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. సైనికులతో ఎక్కువ సమయం గడపడం ద్వారా దేశాన్ని బలోపేతం చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు మోడీ చెప్పుకొచ్చారు.
సైనికులంతా కొంగొత్త ఆవిష్కరణలు చేయాలని, యోగా చేయాలని, తెలియని భారతీయ భాషలు సహచరుల నుంచి నేర్చుకోవాలని మోడీ కోరారు. ఈ సందర్భంగా 1971లో పాకిస్తాన్తో యుద్ధం నాటి పరిస్ధితులను మోడీ గుర్తు చేసుకున్నారు. అప్పటి యుద్ధంలో అసువులు బాసిన బ్రిగేడియర్ కుల్దీప్సింగ్ చాంద్పురికి మోడీ నివాళులు అర్పించారు. అప్పటి సాహసంతో కుల్దీప్ రాష్ట్ర్దీప్గా మారారని మోడీ ప్రశంసించారు. త్రివిధ దళాల సమన్వయానికి అప్పటి యుద్ధం ఓ నిదర్శనమని మోడీ తెలిపారు.