ప్రజాస్వామ్యంపై పాఠాలు కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాల్సిన పనిలేదు: రాహుల్ పై మోడీ అటాక్
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంపై తనకు నీతులు బోధించాల్సిన పనిలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ పరోక్షంగా చురకలంటించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన జమ్ముకశ్మీర్లో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా జమ్ము కశ్మీర్ ప్రజలందరికీ ఆరోగ్య బీమాను కల్పించనున్నారు. ఈ బీమాకు అర్హులైన వారితో ప్రధాన మంత్రి ముచ్చటించారు. ఆయుష్మాన్ పథకం ద్వారా ప్రజలు లబ్ది పొందుతారని చెప్పారు.
ఇక కొద్ది రోజుల క్రితం జమ్మూ కశ్మీర్లో ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రజాస్వామ్యంను బలోపేతం చేసేందుకు జమ్ముకశ్మీర్ ప్రజలు ఓటు వేసేందుకు తరలి వచ్చారని అన్నారు. ఇదే సమయంలో తనకు కొందరు ఢిల్లీలో కూర్చుని నీతిబోధలు చేపడుతున్నారని అలాంటి దుస్థితిలో తాను లేనని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. కొందరు ఢిల్లీలో కూర్చుని తనపై విమర్శలు చేస్తున్నారని, అసభ్య పదజాలంను తనపై ప్రయోగిస్తున్నారని ప్రధాని మోడీ చెప్పారు. జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు ఎంత విజయవంతంగా నిర్వహించామో ముందు తెలుసుకోవాలని మోడీ అన్నారు. తనకు నీతిబోధలు చెప్పేముందు పుదుచ్చేరిలో స్థానిక సంస్థలు నిర్వహించాలని, ఇప్పటికే ఆ ఎన్నికలను నిర్వహించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని కాంగ్రెస్ లక్ష్యంగా ప్రధాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యంపై తనకు నీతి బోధలు చెప్పే పార్టీనే పుదుచ్చేరిలో అధికారంలో ఉందని ముందు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మాట్లాడాలని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. ఇక జమ్ము కశ్మీర్లో ఓటు హక్కు వినియోగించిన ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా ప్రధాని మోడీ అభినందించారు. ప్రజాస్వామ్యం బలోపేతానికి కదిలి వచ్చిన ప్రతిఒక్కరిని అభినందిస్తున్నట్లు చెప్పారు. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన యువత, వృద్ధులను తాను చూసినట్లు చెప్పిన ప్రధాని మోడీ ప్రజాస్వామ్యం మూలాలు వీరితోనే బలోపేతం అవుతుందని చెప్పారు.
Even after Supreme Court has directed that Panchayati and municipal elections should be conducted in Puducherry, the elections are not being conducted there. Those who keep on teaching me lessons on democracy are the ones who are running their govt there: PM Modi pic.twitter.com/Y4HxxuCcUy
— ANI (@ANI) December 26, 2020