అతిపెద్ద స్మార్ట్ ఇండియా ఆన్లైన్ హ్యాకథాన్: మరోసారి మోడీ ప్రసంగం: ఈ సారి ఆ అంశంపై
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలె శనివారం ఏర్పాటు కాబోతోంది. 10 వేల మందికి ఆహ్వానితులు పాల్గొన్న ఆన్లైన్ హ్యాకథాన్ 36 గంటల పాటు కొనసాగుతుంది. శనివారం దీనికి ముగింపు కార్యక్రమాన్ని నిర్వహంచబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన నూతన విద్యా విధానం-2020 గురించి ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర పరిశ్రమలు ఎదుర్కొంటోన్న సవాళ్లను ఛేదించడం, వాటిల్లో నెలకొనే సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలపై ఈ హ్యాకథాన్ను నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ సిరీస్లో ఇది ఫోర్త్ ఎడిషన్. కరోనా వైరస్ వల్ల నెలకొన్న పరిస్థితులను దృష్టలో ఉంచుకుని ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడంలో భాగంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు తమ రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను సులువుగా పరిష్కారం చూపేలా విద్యార్థులను ప్రోత్సహించడానికి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ప్రధాన లక్ష్యం. 2017లో దీన్ని ప్రారంభించారు. ఆ ఏడాది దేశ వ్యాప్తంగా 42వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Recommended Video
గత ఏడాది రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు హ్యాకథాన్లో పాల్గొన్నారు. అప్పట్లో అదో రికార్డు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి. నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. చివరి రౌండ్లో సుమారు లక్ష మంది పాల్గొంటారని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 37 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, 17 రాష్ట్ర ప్రభుత్వాలు, 20 పరిశ్రమలు పంపిన సమస్యలకు తుది రౌండ్లో విద్యార్థులు తమ పరిష్కారాలను సూచిస్తారు.