Unlock 2.0: గైడ్లైన్స్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం..వాటికి నో పర్మిషన్
భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం(జూన్ 30) సాయంత్రం 4గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో ఆయన ప్రసంగించబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సోమవారం మన్ కీ బాత్లో మాట్లాడిన మోదీ.. 'మేము లోకల్ వస్తువులనే కొనుగోలు చేస్తాం. లోకల్ గొంతునే వినిపిస్తాం. ఇది భారత్ను మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుంది.' అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత కొద్ది గంటలకే చైనాపై డిజిటల్ స్ట్రైక్ని ప్రకటించారు. ఏకంగా 59 చైనీస్ యాప్స్పై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో రేపటి ప్రసంగంలో చైనా గురించి మోదీ ప్రస్తావిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు దేశంలో రేపటితో అన్లాక్ 1.0 ముగియనుంది. ఇప్పటికే అన్లాక్ 2.0 మార్గదర్శకాలు కూడా కేంద్రం విడుదల చేసింది. అయితే కరోనా కేసుల రీత్యా మహారాష్ట్ర,తమిళనాడు వంటి రాష్ట్రాలు మాత్రం ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితులు,అన్ లాక్ అంశాలపై కూడా ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది. ఇక అన్లాక్ 2.0కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. కర్ఫ్యూ వేళల్లో సడలింపులు ఇచ్చింది. ఇకపై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుండగా... జూలై 31 వరకు స్కూళ్లు కాలేజీలు తెరవరాదని పేర్కొంది. ఇక ప్రార్థనా ఆలయాలు, సినిమా థియేటర్లు యథావిధిగా మూసే ఉంటాయని స్పష్టం చేసింది.