one nation one health card: మరో కీలక పథకం, పంద్రాగస్ట్ స్పీచ్లో ప్రధాని మోడీ..?
కేంద్ర ప్రభుత్వం మరో కీలక పథకం ప్రవేశ పెట్టబోతోంది. ఒకే దేశం ఒకే హెల్త్ కార్డ్ ప్రకటించబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతకం ఆవిష్కరించిన తర్వాత చేసే ప్రసంగంలో మోడీ ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే దేశంలో కొత్త ఆవిష్కరణ జరిగే అవకాశం ఉంది. చిన్న, పెద్ద, కుల, మతాలకతీతంగా పౌరుల ఆరోగ్య వివరాలు ప్రభుత్వం వద్ద ఉండనున్నాయి.
Recommended Video
డిజిటల్ ఫార్మాట్ రూపంలో భద్రపరిచి..
దేశంలోని ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్ ఫార్మట్లో భద్రపరచే పథకమే వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్ పథకం. ఒక వ్యక్తి తాను చేయించుకున్న వైద్య చికిత్సలు, పరీక్షలకు సంబంధించిన వివరాలు, మెడికల్ హిస్టరీ రికార్డులన్నీ కార్డులో డిజిటల్ ఫార్మట్లో భద్రపరుస్తారు. ఆసుపత్రులు, క్లినిక్లను సెంట్రల్ సర్వర్కు అనుసంధానిస్తారు.
కంపల్సరీ కాదు.. కానీ ఇవీ ప్రయోజనాలు
ఆసుపత్రి, పౌరులు వన్ నేషన్ వన్ హెల్త్ కార్డు కావాలనుకుంటారా అనే వారి ఇష్టానికి వదిలేశారు. ఒకవేళ కార్డు కావాలనుకున్న వారికి 'యునీక్ ఐడీ' జారీ చేస్తారు. ఐడీ ద్వారా సిస్టమ్కు లాగిన్ కావచ్చు. దశలవారీగా పథకాన్ని అమలు చేసే పథకంలో... మొదటి దశలో రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించబోతున్నారు. ఒక వ్యక్తి దేశంలో ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా, ఆసుపత్రి వెళ్లినా తనకు సంబంధించిన డాక్టర్ ప్రిస్కిప్షన్లు, రిపోర్టులు తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది స్కీమ్ అతి పెద్ద ప్రయోజనం. డాక్టరే స్వయంగా యునిక్ ఐడీ ద్వారా పేషెంట్ రికార్డులను చూస్తారు.
ఆధార్ కార్డ్ తరహాలో
ఆధార్ కార్డు తరహాలోనే హెల్త్ కార్డ్ కూడా రూపొందిస్తారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. దీంతో దేశ ఆరోగ్య ముఖచిత్రంలో మార్పు రాబోతుంది. పథకం పరిధిని క్రమంగా ఆసుపత్రులు, క్లినిక్లతోపాటు మెడికల్ స్టోర్, మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు విస్తరించే అవకాశం ఉంది. ఈ కార్డుతో పేదలు, మధ్య తరగతి వారికి ప్రయోజనం జరగనుంది. వారి ఆరోగ్య హిస్టరీ డేటా ఉండటంతో.. వెంటనే నాణ్యమైన వైద్యం అందించే వెసలుబాటు ఉండనుంది.