నేడు మోదీ అఖిలపక్ష సమావేశం... కరోనా వ్యాక్సిన్పై కీలక ప్రకటన వెలువడే ఛాన్స్..?
దేశంలో నెలకొన్న కరోనా వైరస్ పరిస్థితులపై చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలతో ప్రధాని మోదీ శుక్రవారం(డిసెంబర్ 4) వర్చువల్ విధానంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రులు ప్రహ్లాద్ జోషి,అర్జున్ రామ్ మేఘవాల్,వి.మురళీధరన్ ఇప్పటికే అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలతో దీనిపై మాట్లాడారు.
ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్,సోషల్ జస్టిస్ మినిస్టర్ తవార్చంద్ గెహ్లాట్,ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ పాల్గొననున్నారు. సమావేశం ప్రారంభంలో మొదటి 15-20నిమిషాలు కేంద్ర ఆరోగ్య సెక్రటరీ కరోనా పరిస్థితులపై ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రయోగ దశల్లో ఉన్న పలు వ్యాక్సిన్ల గురించి కేంద్ర ఆరోగ్యమంత్రి ఈ సమావేశంలో ఎంపీలతో చర్చించే అవకాశం ఉంది. సమావేశం చివరలో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు.
పార్లమెంటులో ఐదుగురు ఎంపీల కంటే ఎక్కువ ప్రాతినిధ్యం ఉన్న పార్టీలకు నేటి సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వనున్నారు. టీఆర్ఎస్ పార్టీ తరుపున ఎంపీ నాగేశ్వరరావు,వైసీపీ తరుపున ఎంపీ మిథున్ రెడ్డి సమావేశంలో మాట్లాడనున్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లోని భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కోవ్యాగ్జిన్,పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ది చేస్తున్న కోవీషీల్డ్,అహ్మదాబాద్లో జైదుస్ క్యాడిలా తయారుచేస్తున్న వ్యాక్సిన్లను పరిశీలించిన సంగతి తెలిసిందే. యూకె,రష్యా వంటి దేశాలు ఎమర్జెన్సీ వ్యాక్సిన్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందునా...భారత్లోనూ అలాంటి అనుమతులేమైనా ఇచ్చే అవకాశం ఉందా.. నేటి సమావేశంలో దానిపై చర్చిస్తారా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీపై ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు చేసే అవకాశం ఉండవచ్చునన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
కరోనా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఏప్రిల్లో కరోనాపై చర్చించేందుకు మొదటిసారి కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.