నేడు ఐరాసలో ప్రధాని మోడీ కీలక ప్రసంగం- భద్రతామండలి సభ్యదేశంగా అజెండా ప్రకటన...
అమెరికాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 75వ వార్షిక సమావేశాల సందర్భంగా భారత ప్రధాని మోడీ ఇవాళ కీలక ప్రసంగం చేయబోతున్నారు. ఈ సారి ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోడీ ప్రసంగానికి చాలా ప్రాధాన్యతలున్నాయి. ఐరాస భద్రతా మండలిలో భారత్కు తాజాగా రెండేళ్ల తాత్కాలిక సభ్యత్వం దక్కింది. ఈ నేపథ్యంలో భారత్ వ్యక్తం చేసే అభిప్రాయాలకూ, సూచనలకూ అందుకు తగినట్లుగానే విలువ ఉంటుంది. అలాగే ప్రధాని మోడీ తాజాగా ఐక్యరాజ్యసమితితో సంస్కరణలు చేపట్టకపోతే భవిష్యత్తులో సమస్యలు తప్పవనే హెచ్చరికలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సర్వప్రతినిధుల సభను ఉద్దేశించి మోడీ చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
జనరల్ అసెంబ్లీలో మోడీ ప్రసంగం..
ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక సమావేశాల్లో ఈసారి మువ్వన్నెల పతాక రెపరెపలాడబోతోంది. ప్రధాని మోడీ భద్రతా మండలి సభ్యదేశంగా ఎంపికైన భారత్ ప్రతినిధిగా ఇవాళ కీలక ప్రసంగం చేసేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా నేపథ్యంలో వర్చువల్గా నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో ప్రధాని ముందుగా రికార్డు చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేయనున్నారు. సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రధాని ప్రసంగాన్ని వీడియో మోడ్లో సర్వప్రతినిధుల సభలో ప్రదర్శిస్తారు. భద్రతా మండలికి కాబోయే సభ్య దేశంగా ప్రధాని మోడీ చేసే ప్రసంగంలో ప్రస్తావించే అంశాలను ప్రపంచం నిశితంగా గమనించబోతోంది.
మోడీ ప్రసంగంలో కీలకాంశాలివే...
భారత్ తాజాగా భద్రతా మండలి సభ్య దేశంగా ఎంపికైంది. వచ్చే జనవరి నుంచి రెండేళ్ల పాటు భారత్ భద్రతామండలి సభ్యదేశంగా వ్యవహరించబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ భద్రతా మండలి సభ్య దేశంగా బాధ్యతలు చేపట్టకముందే చేస్తున్న ప్రసంగంలో పలు కీలక అంశాలను ప్రస్తావించబోతున్నారు. ఇందులో ముందుగా భారత్ ప్రాధాన్యతలను ప్రపంచానికి వివరించనున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పుల విషయంలో భారత్ అభిప్రాయాలు, చేపట్టాల్సిన చర్యలను ప్రధాని సర్వప్రతినిధి సభకు వివరిస్తారు. అలాగే తీవ్రవాద బాధిత దేశంగా భారత్ అభిప్రాయాలను కూడా ప్రధాని స్పష్టం చేయనున్నారు. తీవ్రవాదంపై ఐరాస వ్యవహరించాల్సిన తీరును కూడా ప్రధాని ప్రస్తావిస్తారు. మరోవైపు కోవిడ్ను ఎదుర్కోవడంలో భారత్ ఫార్మా రంగంలో చేస్తున్న కృషిని కూడా ప్రధాని వివరిస్తారు.
అలాగే ఐక్యరాజ్యసమితి తరఫున శాంతి దూతలుగా ఉండే విషయంలోనూ భారత్ అభిప్రాయాన్ని ప్రధాని వెల్లడిస్తారు
ఇమ్రాన్ ప్రసంగానికి కౌంటర్...
భారత్లో తీవ్రవాదాన్ని ఎగదోస్తున్న పొరుగుదేశం పాకిస్తాన్ విషయంలోనూ భారత్ మరోసారి తన అభ్యంతరాలను ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకు రానుంది. ఐరాస వేదికగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగంపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న భారత్ గట్టి కౌంటర్ ఇవ్వబోతోంది. ప్రధాని మోడీ తన ప్రసంగంలో ఇమ్రాన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడంతో పాటు తీవ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలకు కౌంటర్ ఇచ్చే విషయంలో ఐక్యరాజ్యసమితి బాధ్యతను కూడా గుర్తు చేయబోతున్నారు. భద్రతామండలి సభ్యదేశంగా వచ్చే రెండేళ్ల పాటు తీవ్రవాదాన్ని అరికట్టేందుకు తాము చర్యలు తీసుకుంటామని కూడా ప్రధాని చెప్పబోతున్నారు.
Recommended Video
భద్రతామండలి సభ్యదేశంగా అజెండా...
భద్రతామండలి సభ్యదేశంగా వచ్చే జనవరిలో బాధ్యతలు చేపట్టబోతున్న భారత్ రెండేళ్లపాటు ఆ హోదాలో కొనసాగబోతోంది. ఈ రెండేళ్ల కాలంలో అమలు చేయాల్సిన అజెండాను భారత్ ఇప్పటికే ఖరారు చేసింది. ఇందులో మూడు ప్రధాన అంశాలున్నాయి. వీటిలో ప్రధానమైనది అంతర్జాతీయంగా తీవ్రవాద నిర్మూలన చర్యలు. తీవ్రవాదంపై బహుముఖ పోరుతో పాటు తీవ్రవాద సంస్దలను, వాటి నిధులను బ్లాక్ చేయడం. రెండోది ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి తరఫున వివిధ దేశాల్లో పనిచేస్తున్న శాంతి దళాల్లో సంస్కరణలు చేపట్టడం. ఆయా శాంతిదళాల్లో ఏయే దేశాలుండాలి, వాటి పాత్ర ఎలా ఉండాలన్న దానిపై భారత్ ప్రధానంగా దృష్టిపెట్టబోతోంది. మూడవది అభివృద్ధి ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం. వీటి అమలు కోసం తాము చేయబోయే ప్రయత్నాలను ప్రధాని ప్రస్తావించబోతున్నారు.