ప్రధాని మోడీకి కొత్త విమానం..దీని ప్రత్యేకతలు తెలుసుకోండి..!
Recommended Video
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్న రెండు B777 విమానాలను ఏర్పాటు చేయనుంది. ఇందులో అత్యాధునిక వ్యవస్థ ఉన్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర వీవీఐపీల కోసం ఈ విమానాలను ప్రభుత్వం వినియోగిస్తుంది. వచ్చే ఏడాది జూలై నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయి. ఈ విమానాలను ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన పైలట్లు నడుపుతారు. ఇప్పటి వరకు ప్రధాని ప్రయాణించే విమానాన్ని ఎయిరిండియా పైలట్లు నడిపేవారు.
కొత్తగా వస్తున్న ఈ విమానాల మెయింటెయినెన్స్ను ఎయిరిండియాకు అనుబంధ సంస్థగా ఉన్న ఎయిరిండియా ఇంజినీరిం్ సర్వీసెస్ లిమిటెడ్ తీసుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీలు ఎయిరిండియా వన్ అని రాసిఉన్న ఎయిరిండియా B747లో ప్రయాణిస్తున్నారు. ఈ విమానాలను ఎయిరిండియా పైలట్లు నడుపుతున్నారు. వీటి మెయింటెనెన్స్ ఏఐఈఎస్ఎల్ చూసుకుంటోంది. వీఐపీల పర్యటలు లేని సమయంలో ఈ విమానాలను సాధారణ పౌరులను గమ్యస్థానాలకు చేర్చడం కోసం వినియోగిస్తున్నారు.
సరికొత్త B777 విమానాలను అమెరికాలోని బోయింగ్ సంస్థ తయారు చేస్తోంది. వచ్చే ఏడాది జూలై నాటికల్లా ఇవి భారత్కు చేరుకుంటాయి. వీటికి కూడా ఎయిరిండియా వన్ అనే కాల్ సైన్ ఉంటుంది. వీటిని కేవలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు మాత్రమే నడుపుతారని ఎయిరిండియా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఆరుగురు పైలట్లకు B777 విమానం నడపడంపై శిక్షణ ఇచ్చినట్లు ఎయిరిండియా అధికారి తెలిపారు. మరికొంతమంది త్వరలో శిక్షణ కోసం వస్తారని చెప్పారు.
ఇక B777 విమానం అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్న విమానం. ఇందులో మిస్సైల్ వ్యవస్థ ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు డిఫెన్స్ వ్యవస్థలను 190 మిలియన్ డాలర్లకు భారత్కు అమ్మేందుకు అమెరికాతో ఒప్పందం జరిగింది.