వీడియో కాన్ఫరెన్స్.. కరోనాపై సర్పంచులతో మోదీ కీలక వ్యాఖ్యలు..
ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొంతమంది సర్పంచులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈసారి కూడా ఆయన 'గంచా'(మాస్కు లాంటి వస్త్రం) ధరించారు.కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు ముందుండి కరోనా కట్టడికి కృషి చేస్తున్నందుకు అభినందించారు. మెరుగైన సేవలు అందించి పురస్కారాలు పొందిన సర్పంచులకు అభినందనలు తెలిపారు. ఇప్పటినుంచి ఏటా మెరుగైన పనితీరు కనబర్చే గ్రామ పంచాయతీలకు కూడా పురస్కారాలు అందిస్తామన్నారు.
ఈ సందర్భంగా ఈ-గ్రామస్వరాజ్ పోర్టల్ మొబైల్ ఆప్ను ప్రధాని అవిష్కరించారు. దీని ద్వారా ఎన్నో సేవలు అందుబాటులోకి వస్తాయని.. ముఖ్యంగా బ్యాంకు రుణాలు తీసుకోవడం చాలా సులువుగా మారుతుందన్నారు. గ్రామాల్లో సమస్యలు గుర్తించడం,పరిష్కరించడం కూడా దీని ద్వారా సులువు అవుతుందన్నారు. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలంగా ఉంటేనే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రస్తుతం లక్షా 25 వేల పంచాయతీల్లో బ్రాడ్బ్యాండ్ సేవలు అందుతున్నాయని వివరించారు.
Recommended Video
కరోనా సంక్షోభ కాలంలో పేదలకు సరిపడా ఆహార ధాన్యాలు అందించాలని.. విద్యుత్,రహదారులు,పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సర్పంచులకు సూచించారు. పంచాయతీ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంతగా బలంగా ఉంటుందన్నారు. ప్రాథమిక అవసరాలను తీర్చుకునే స్వావలంబన గ్రామాలు సాధించాలన్నారు. కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు. మనం వెళ్తున్న దారిలో మనకు ఎన్నో ఆటంకాలు కలుగుతాయని.. ఇలాంటి విపత్కర సమయంలో మరింత మనో నిబ్బరంతో పనిచేయాలని సూచించారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.