చెన్నై టు పోర్ట్ బ్లెయిర్: చారిత్రాత్మక ఘట్టం: అండమాన్ ప్రజల కలను నెరవేర్చేలా..కాస్సేపట్లో
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో చారిత్రాత్మక ఘట్టానికి తెర తీయబోతున్నారు. దశాబ్దాల నుంచి ఎదురు చూస్తోన్న అండమాన్ నికోబార్ ద్వీప ప్రజల చిరకాల వాంఛ మరి కొద్దిసేపట్లో నెరవేరబోతోంది. భారత్ నుంచి అండమాన్ నికోబార్ దీవుల మధ్య ఏర్పాటు చేసిన సబ్ మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును మోడీ ప్రారంభించబోతున్నారు. ఈ ఉదయం 10:30 గంటలకు దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ఈ ప్రాజెక్టుకు ప్రారంభించనున్నారు. చెన్నై నుంచి అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ మధ్య ఈ మేరకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లింకేజీని కల్పించారు.
సెకెనునకు 2*200 గిగాబైట్స్
సెకెనుకు 2*200 గిగాబైట్ల సామర్థ్యంతో హైస్పీడ్ బ్యాండ్ విడ్త్తో నెలకొల్పిన సబ్ మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లింకేజ్ ఇది. 20 నెలల కిందట ప్రధాన మంత్రి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు దాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏడు ద్వీపాల్లో నివసించే ప్రజలకు హైస్పీడ్ బ్యాండ్విడ్త్తో ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది. స్వరాజ్ దీప్ (హ్యావ్లాక్), లాంగ్ ఐలండ్, రంగట్, హట్బే (లిటిల్ అండమాన్), కమోర్టా, కార్ నికోబార్, క్యాంప్బెల్ బే (గ్రేట్ నికోబార్) ద్వీపాలు ఈ ప్రాజెక్టు వల్ల లబ్ది పొందుతాయి. ఆయా ద్వీపాల్లో నివసించే వారి రోజువారీ కార్యక్రమాలు మరింత మెరుగుపడటానికి కారణమౌతుందనే అభిప్రాయం ఉంది.
రక్షణపరంగా వ్యూహాత్మకమే..
చైనాతో సరిహద్దు వివాదాలు తలెత్తడం, ఇది కాస్తా యుద్ధ వాతావరణానికి దారి తీసిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం. రక్షణపరంగా కూడా దీన్ని వ్యూహాత్మకంగా తీసుకుంది. దక్షిణాసియా సముద్ర జలాలపై పట్టు సాధించడానికి చైనా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం క్రమంగా అండమాన్ నికోబార్ దీవులను రక్షణపరంగా కీలక స్థావరంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా- సబ్ మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
పర్యాటక రంగం మరింత బలపడేలా..
ఈ ప్రాజెక్టు వల్ల పర్యాటక రంగం, ఆర్థిక కార్యకలాపాలకు కూడా మరింత ఊతం ఇచ్చినట్టుగా ఉంటుందనే అభిప్రాయాలు కేంద్ర ప్రభుత్వ అధికారుల్లో వ్యక్తమౌతున్నాయి. అండమాన్ దీవుల్లో నివసించే ప్రజలకు హైస్పీడ్ బ్యాండ్విడ్త్తో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడం వల్ల అటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని అంటున్నారు. విద్య బోధన, టెలిమెడిసిన్, ఆన్లైన్ క్లాసులు, టెలి ఎడ్యుకేషన్ రంగాన్ని ప్రోత్సహించినట్టవుతుందని చెబుతున్నారు. పరిపాలన వేగవంతం అవుతుందని, ఇ-గవర్నెన్స్ మరింత మెరుగుపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
మోడీ ట్వీట్..
సబ్ మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని పురస్కరించుకుని కొద్దిసేపటి కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ ట్వీట్ చేశారు. ఆగస్టు 10వ తేదీ తన జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. అండమాన్, నికోబార్ దీవుల్లో నివసించే ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చబోతున్నానని అన్నారు. ఈ ఉదయం 10:30 గంటలకు తాను ఈ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. చెన్నై-పోర్ట్ బ్లెయిర్ మధ్య ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీని కల్పించడానికి అవసరమైన చర్యలన్నింటినీ తాము పూర్తి చేశామని, ఇక దాన్ని ప్రారంభించడమే ఆలస్యమని అన్నారు.