ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం 11న: వ్యాక్సినేషన్ పైనే ప్రధాన చర్చ!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి దేశం సిద్ధమవుతున్నవేళ ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్లు రూపొందించిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వ్యాక్సిన్ల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే డ్రైరన్ నిర్వహించిన విషయం తెలిసిందే.
మరోవైపు మరికొన్ని రోజుల్లోనే టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోందని ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, దేశ వ్యాప్తంగా త్వరలోనే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఇటీవల వ్యాఖ్యానించారు. మొదట ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ సమూహాలకు వ్యాక్సిన్ అందజేయడం జరుగుతుందని చెప్పారు. సుమారు 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.
హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభిృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా సంస్థలతో సంయుక్తంగా తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్కు అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ రెండు వ్యాక్లిన్లను దేశ వ్యాప్తంగా ఇవ్వనున్నారు.