ట్రంప్తో భేటీ కానున్న మోడీ: జమ్మూకాశ్మీర్ అంశమే కీలకం, 45నిమిషాలపాటు చర్చ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల్లో బిజి బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్, యూఏఈ, బహ్రెయిన్లో పర్యటించిన మోడీ.. జీ 7 సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం మరోసారి ఫ్రాన్స్ దేశంలో అడుగుపెట్టారు. ఫ్రాన్స్, యూఏఈ , బహ్రెయిన్ దేశాల అధినేతలతో వరుసగా భేటీ అవుతూ కీలక చర్చలు జరిపి, పలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
ఆదివారం ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం 3.45గంటలకు వీరి భేటీ ప్రారంభం కానుంది. సుమారు 45 నిమిషాలపాటు జరిగే ఈ సమావేశంలో మోడీ, ట్రంప్ కీలక అంశాలపై చర్చించనున్నారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత పాకిస్థాన్ వ్యవహారశైలిని ట్రంప్కి ప్రధాని మోడీ వివరించే అవకాశం ఉంది.
జమ్మూకాశ్మీర్ అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. జమ్మూకాశ్మీర్ అంశంపై ప్రధాని మోడీతో డొనాల్డ్ ట్రంప్ చర్చించనున్నట్లు ఇప్పటికే అమెరికా వర్గాలు చెప్పాయి. భారత్, పాకిస్థాన్ దేశాలు సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలని ఇటీవల ట్రంప్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత భారత్, పాక్ మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
'జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి ఫ్రాన్స్లోని బిర్రిట్జ్ చేరుకున్నారు. సదస్సులోని అంశాలతోపాటు ద్వైపాక్షిఖ అంశాలను కూడా సదస్సులో చర్చించనున్నారు. ప్రపంచ దేశాధి నేతలు ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తారు' అని ప్రధానమంత్రి కార్యాలయంలో ట్విట్టర్లో పేర్కొంది.
జీ-7 సదస్సులో పర్యావరణం, డిజిటల్ రూపాంతరీకరణ అంశాలపై మోడీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీ.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో కూడా భేటీ కానున్నారు. కాగా, జీ-7 సమూహంలో భారత్ సభ్య దేశం కాకపోయినప్పటికీ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రత్యేకంగా ఆహ్వానించడంతో మోడీ ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా దేశాలు మాత్రమే జీ-7లో సభ్య దేశాలుగా ఉన్నాయి. గతంలో రష్యను తొలగించడంతో జీ-8గా ఉన్న ఈ సమూహం జీ-7గా మారిపోయింది. ప్రస్తుతం రష్యను తిరిగి తీసుకోవాలని సభ్యదేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.