నేడు కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్ధలకు మోడీ- హైదరాబాద్, అహ్మదాబాద్, పుణేల్లో
భారత్లో కరోనా వ్యాక్సిన్ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రధాని మోడీ ఇవాళ దీనిపై సమీక్ష నిర్వహించేందుకు సిద్దమయ్యారు. అహ్మదాబాద్, పుణే, హైదరాబాద్లో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను ఆయన ఇవాళ నేరుగా పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత అక్కడే వాటి తాజా పరిస్ధితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
శబరిమలలో కరోనా కల్లోలం- 39 మందికి వైరస్ పాజిటివ్- 27 మంది ఆలయ సిబ్బందే..
ప్రధాని మోడీ ముందుగా అహ్మదాబాద్లోని జైడూస్ క్యాడిలా సంస్ధకు చెందిన జైడూస్ బయోటెక్ పార్క్లో ఉన్న కరోనా వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ వ్యాక్సిన్ తయారీకి సంబంధించి వివరాలు తెలుసుకుంటారు. అనంతరం అక్కడే అధికారులతో వ్యాక్సిన్ ఎప్పటికల్లా అందుబాటులోకి వస్తుంది, ఇప్పటివరకూ జరిగిన ప్రయోగాల ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎంత ధరకు దీన్ని అందించబోతున్నారు వంటి వివరాలను ప్రధాని తెలుసుకుంటారు.
అనంతరం హైదరాబాద్లోని భారత్ బయోటెక్ పార్క్ను ప్రధాని మోడీ సందర్శిస్తారు. హైదరాబాద్ పర్యటనలో హకీంపేట్ ఎయిర్బేస్కు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ప్రధాని మోడీ భారత్ బయోటెక్కు వెళతారు.. ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్కు కూడా ఆహ్వానం లేదు. కేవలం ఐదుగురు అధికారులను మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇందులో హకీంపేట్ ఎయిర్ కమాండెంట్ కేవీ సురేంద్ర నాయర్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి,హైదరాబాద్ డీజీపీ మహేందర్ రెడ్డి,సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఉన్నారు. సాయంత్రం 3.40 నిమిషాలకు మోదీ హైదరాబాద్లోని హకీంపేట్ ఎయిర్బేస్కు చేరుకుని అక్కడి నుంచి సాయంత్రం 4గం.-5 గం. మధ్య జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ సంస్థను ప్రధాని సందర్శిస్తారు. ఆ సంస్థ తయారుచేస్తున్న కోవ్యాక్సిన్కి సంబంధించి సైంటిస్టులను వివరాలు అడిగి తెలుసుకుంటారు. సాయంత్రం 5.40 నిమిషాలకు ప్రధాని మళ్లీ తిరుగు ప్రయాణం అవుతారని తెలుస్తోంది.
Recommended Video
అనంతరం పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ను కూడా మోడీ సందర్శించనున్నారు. అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలతో కలిసి భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ 'కోవిషీల్డ్ ' అభివృద్ధి, సరఫరాకు సీఐఐ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ సీఐఐ సందర్శనను పుణె డివిజనల్ కమిషనర్ సౌరవ్ రావు అధికారికంగా ప్రకటించారు. 70 శాతం సామర్థ్యంతో కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్లు ఆక్స్ఫర్డ్ -ఆస్ట్రాజెనికా వెల్లడించింది. ఆ తర్వాత కోవిషీల్డ్ వ్యాక్సిన్ 90 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని ఆక్స్ఫర్డ్ -ఆస్ట్రాజెనికా తెలిపింది. ఒక డోసుతోనే ఈ మేరకు ఫలితాలను ఇవ్వడం గమనార్హం. దీంతో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోవిషీల్డ్ పై భారీ అంచనాలున్నాయి.