ప్రధాని మోడీకి సీఏఏ సెగ: గౌహతి పర్యటన రద్దు ,ఆల్ అస్సాం స్టూడెంట్స్ వార్నింగ్
గౌహతి: అస్సాం రాష్ట్రవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ సెగ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి తాకే అవకాశం ఉంది. జనవరి 10న గౌహతిలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రావాల్సి ఉంది. అయితే పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటుతుండటంతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. పర్యటన రద్దు అయినట్లు అధికారికంగా ప్రకటన రాకున్నప్పటికీ అనధికారిక సమాచారం మాత్రం తమకు అందినట్లు ఖేలో ఇండియా గేమ్స్ సీఈఓ అవినాష్ జోషి చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి హాజరైతే పర్యటనను అడ్డకుంటామని నిరసనలకు నాయకత్వం వహిస్తున్న ఆల్ ఆస్సాం స్టూడెంట్స్ యూనియన్ హెచ్చరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ 15 నుంచి 17 వరకు భారత్ జపాన్ దేశాల మధ్య జరగాల్సిన సమావేశం కూడా నిరసనల కారణంగా రద్దు కావడం జరిగింది. అస్సాంలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తడంతో జపాన్ ప్రధాని షింజో అబే తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
గత రెండేళ్లుగా ఎన్ఆర్సీపై అస్సాంలో నిరసనలు వ్యక్తమవుతుండగా... పౌరసత్వ సవరణ చట్టం తీసుకురావడంతో ఆ నిరసనలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. గతేడాది డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టగానే అస్సాం రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది. నిరసనకారులు బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగారు. గౌహతిలో పలు బస్సులను తగలబెట్టారు. పోలీసులు లాఠీ ఛార్జీ కూడా చేశారు. అంతేకాదు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను సైతం ప్రయోగించారు.
ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఆ తర్వాత చెలరేగిన హింసలో మరో ఇద్దరు మృతి చెందారు. ఇదిలా ఉంటే ఖేలో ఇండియా గేమ్స్ 2018లో ప్రారంభించారు. దేశంలోని క్రీడలన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ క్రీడలను ప్రారంభించారు. జనవరి 10న గేమ్స్కు సంబంధించి మూడో ఎడిషన్ ప్రారంభం కానున్నాయి. ఈ గేమ్స్ జనవరి 10 నుంచి జనవరి 22వరకు జరుగుతాయి.