కలాం అన్న కాళ్లు మొక్కిన మోడీ, గీత గీసిన మరైకర్
రామేశ్వరం: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సోదరుడు మొహమ్మద్ ముత్తు మీరా లెబ్బై మరైకర్ కాళ్లకు మొక్కారు. తమిళనాడు రామనాథపురం జిల్లాలోని రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు గురువారం జరిగాయి.
ఈ అంతిమ వేడుకలకు ప్రదాని నరేంద్ర మోడీ తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోడీ ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. కలాం 99 ఏళ్ల అన్నయ్య మొహమ్మద్ ముత్తును పరామర్శించి, ఆయనకు పాదాభివందనం చేశారు.
కలాం అన్న మరైకర్ మల్లెపూలతో గీచిన గీత అందర్నీ కన్నీళ్లు పెట్టించింది. తన అన్నే తన సర్వస్వమని, తనను ఓ తండ్రిలా పెంచి పెద్దజేసింది అన్నేనని, తన చదువుల కోసం ఆయన శ్రమ వర్ణించలేనిదంటూ కలాం పలుమార్లు మరైకర్ గురించి చెప్పారు.
కలాం విద్యాభ్యాసంలో ఉపాధ్యాయులది కీలకపాత్రే అయినప్పటికీ కలాంకు గీత చక్కగా గీయడాన్ని నేర్పించింది మాత్రం మరైకరే. మరైకర్కు ఆ రోజులు గుర్తుకొచ్చాయి. కళ్లెదుటే జీవం లేకుండా ఉన్న తమ్ముణ్ని చూసి కన్నీళ్లు ఆగలేదు. పక్కనే ఉన్న తెల్ల పువ్వులను తీసుకుని భౌతికకాయం ఎదుట నిటారుగా ఓ గీత గీశారు.
కలాం స్వగ్రామాన్ని చూడాలని, తన ఆత్మకథలో కలాం రాసుకున్న ఆ వీధులు, దేవాలయాలు, రైలు పట్టాలు, పంబన్ బ్రిడ్జి చూడాలని మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాంతో పని చేసిన వారి కోరిక. ఎవరైనా మీ ఊరికి తీసుకెళ్లమని అడిగితే 2016లో తీసుకెళ్తానని చెప్పేవారు కలాం.
అందుకు కారణం ఉంది. తనను ఈ స్థాయికి తీసుకు వచ్చిన తన అన్నయ్యకు వందవ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలని కలాం భావించారు. మరైకర్ 100వ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలనుకున్నారు. అందుకే ఆ వేడుకకు తీసుకెళ్తానని అందరికీ చెప్పేవారు. కలాం ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు.