ఇక చాలు, ఇంటికి వెళ్లు: మోడీపై నెటిజన్ల ఆగ్రహం
తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీ పైన సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళను సోమాలియాతో పోల్చుతూ ప్రధాని మోడీ మాట్లాడారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 'ఇక చాలు, ఇంటికి వెళ్లు' అని ఆగ్రహిస్తున్నారు.
కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ... దేవుని సొంత దేశం అని పేరున్న కేరళలో శాంతి భద్రతలు సోమాలియా కంటే దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ కార్యకర్తల హత్య, దళిత యువతిపై అత్యాచారం.. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వాం వైఫల్యాన్ని పక్కన పెడితే, కేరళను సోమాలియాతో పోల్చడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో మలయాళంలో విజయం సాధించిన ఓ సినిమాలోని డైలాగ్ 'పో మోనే దినేశా' కు పేరడీగా 'పో మోనే మోడీ' (ఇక చాలు, ఇంటికెళ్లు) అని విమర్శలు చేస్తున్నారు.
కేరళను సోమాలియాతో పోల్చడం దేశ ప్రధానిగా ఆయనకు సిగ్గుచేటు కాదా అని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ విమర్శించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలు సరికాదన్నారు.