మీడియాతో జాగ్రత్త, ఏపీపై ఇప్పుడు కాదు, త్వరలో మాట్లాడుతా: నేతలకు మోడీ క్లాస్, 'దక్షిణాది'పై కౌంటర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు క్లాస్ తీసుకున్నారు. మీడియాకు మసాలా అందించవద్దని ఆదేశించారు. మీ అంతట మీరే మీడియాకు కావాల్సినంత మసాలా ఇవ్వవద్దని, వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లవద్దని చెప్పారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో ఆయన నమో యాప్ ద్వారా ఆదివారం దిశానిర్దేశనం చేశారు.
మీడియాకు కావాల్సినంద మసాలా అందిస్తూ మనం తప్పులు చేస్తున్నామని, కెమెరా కనబడగానే సామాజిక శాస్త్రవేత్తల మాదిరిగా లేదా నిపుణుల తరహాలో మాట్లాడుతున్నామని, వాటినే మీడియా అస్త్రాలుగా మార్చుకుంటోందని, అది మీడియా తప్పు కాదని చెప్పారు. జార్ఖండ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయం స్ఫూర్తిగా గ్రామీణ ప్రజానీకం మనసులు గెలుచుకునేందుకు కృషి చేయాలని సూచించారు.
ఆ దుర్మార్గుడు అడుక్కున్నాడు, మీ ఫ్యామిలీని లాగడం వెనుక కుట్ర ఇదీ, ఇంటి ముఖం చూడకు: పవన్కు ముద్రగడ
మీడియాతో జాగ్రత్తగా ఉండాలి
మీడియాతో జాగ్రత్తగా ఉండాలని, నోటిని అదుపులో పెట్టుకోవాలని ప్రధాని మోడీ తలంటారు. ఏదో ఒకటి మాట్లాడి పార్టీకి తలవంపులు తెస్తున్న కొందరి వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి ఒకింత గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. పార్టీకి ప్రజాదరణతో పాటు బాధ్యతా పెరిగిందనీ, బాధ్యతారాహిత్యంగా ఏదో ఒకటి మాట్లాడవద్దని హెచ్చరించారు. ఉగ్రవాదం, అత్యాచారాలు, మహాభారతం, డార్విన్ సిద్ధాంతం, ఉప ఎన్నికల ఫలితాలు వంటి వేర్వేరు అంశాల్లో కొందరు బీజేపీ నేతలు మాట్లాడిన తీరు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో వారితో పాటు పార్టీకి నష్టం కలుగుతుండటంతో మోడీ గట్టిగా మందలించారు.
మనం తప్పు చేసి వారిని అంటే ఎలా?
మనం తప్పులు చేస్తూ, మీడియాకు మసాలా అందిస్తూ మళ్లీ వాటినే నిలదీస్తే ఎలా అని మోడీ చురకలు అంటించారు. కెమెరా కనిపిస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటామని, అరకొర సమాచారం తెలిసి మాట్లాడుతామని, అదే ఇబ్బందులు తీసుకు వస్తోందని చెప్పారు. మీడియా తన పని తాను చేస్తోందని, వివాదం అయ్యాక మనం మీడియాను అంటే లాభం లేదన్నారు. మనం మాట్లాడితేనే ప్రచారంలోకి వస్తున్నాయన్నారు. మనం సంయమనం పాటించాలన్నారు. సంబంధిత అంశాలపై మాట్లాడే వారు ఎలాగూ మాట్లాడుతారన్నారు.
ఎంపీలకు ట్విట్టర్లో 3 లక్షలకు పైగా ఉంటే నేను మాట్లాడుతా
విపక్షంలో ఉన్నన్నాళ్లూ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేశారని, ఇప్పుడు ప్రభుత్వంలో మనమంతా సేవలందిస్తున్నామని, ప్రజలతో అనుసంధానమై ఉండడం వల్లనే ఇక్కడివరకు మనం వచ్చామని, ఎంపీలు ప్రజల వద్దకు పనుల్ని తీసుకువెళ్లాలని, క్షేత్రస్థాయి ఇబ్బందుల్ని ప్రభుత్వానికి నివేదించాలని మోడీ సూచించారు. శాసనకర్తలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని అనుచరుల సాయంతో విషయసేకరణ జరపాలన్నారు. ఇలాంటి ప్రయత్నంతోనే జీఎస్టీని విజయవంతంగా అమలు చేశామన్నారు. ఎంపీలకు ట్విటర్లో 3 లక్షలకు పైగా అనుచరులు ఉంటే వారి నియోజకవర్గ ప్రజలతో తాను మాట్లాడతానని చెప్పారు.
'దక్షిణాది' వ్యాఖ్యలకు మోడీ కౌంటర్
బీజేపీ అంటే ఒక వర్గానికో, ఉత్తరాది ప్రాంతానికో పరిమితమైన పార్టీ కాదని మోడీ అన్నారు. దీనిని హిందు అనుకూల పార్టీగా లేదా కేంద్రం దక్షిణాదికి మోసం చేస్తోందనే కొందరికి పై వ్యాఖ్యలతో పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. దళిత, గిరిజన, ఓబీసీ శాసనకర్తల్లో ఎక్కువమంది బీజేపీ వాళ్లే అన్నారు. అందరి పార్టీగా, సమ్మిళిత సంస్థగా ఎదిగామనీ, ప్రజాబలమే కొండంత అండ అన్నారు. నిరుద్యోగంపై విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టారు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా స్వయం ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. గ్రామాలపై తమ సర్కారు ప్రత్యేక దృష్టిపెట్టిందనీ, అందుకే ఎంపీలు, మంత్రులను దాదాపు 20 వేల గ్రామాల్లో రాత్రిపూట బస చేయాల్సిందిగా ఆదేశించామన్నారు.
ఏపీపై త్వరలో మాట్లాడుతానని మోడీ
గ్రామస్వరాజ్యం దిశగా ఏపీలోని పల్లెలను తయారు చేయాలని ప్రధాని మోడీ సూచించినట్లు శాసనమండలి సభ్యుడు మాధవ్ తెలిపారు. ప్రధాని మోడీ ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన విజయవాడలో పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, కుటుంబ, వ్యక్తిగత సంక్షేమ పథకాల అమలు సక్రమంగా జరిగేలా చూడాలని, దానివల్ల గ్రామస్వరాజ్యం సిద్ధిస్తుందని, ప్రజాప్రతినిధులుగా మీరు కూడా సంతృప్తి పొందుతారని మోడీ అన్నారు. రైతులకు సంబంధించి ఫసల్ భీమా యోజన, భూసార పరిక్ష కార్డులు, ప్రజలందరికీ ఉపయోగపడే ఆయుష్మాన్ భవ వంటి పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మోడీ సూచించారని మాధవ్ చెప్పారు. నాయకులే ప్రచారకర్తలుగా మారాలన్నారు. ఏపీకి సంబంధించి రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై రాష్ట్ర బీజేపీ నేతలు ప్రధానికి విన్నవించారు. అయితే ప్రస్తుతం దేశానికంతా వర్తించే కేంద్రం పథకాల అమలు, ప్రచారం పైన మాత్రమే మాట్లాడదామన్నారు. ఏపీకి సంబంధించి అతి త్వరలోనే ప్రత్యేకంగా మాట్లాడతానని, హామీల అమలుకు కట్టుబడి ఉంటామన్నారు.