డాక్టర్లకు అమ్మాయిల ఎర: ఫార్మా కంపెనీలకు ప్రధాని మోడీ తీవ్ర హెచ్చరిక
న్యూఢిల్లీ: వైద్యుల చేత తమ కంపెనీ మందులను ప్రిస్క్రిప్షన్లో రాయించుకోవడానికి పలు ఫార్మా కంపెనీలు వికృత చర్యలకు దిగడంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి కంపెనీలపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ఆ పద్ధతి మార్చుకోండి..
డాక్టర్లకు యువతులను ఎరవేస్తూ, వారిని విదేశీ విలాస యాత్రలకు పంపుతూ.. ఖరీదైన వస్తువులను బహుమతులుగా ఇచ్చే సంప్రదాయాలను మానుకోవాలని సదరు ఫార్మా కంపెనీలకు ప్రధాని మోడీ హితవు పలికారు. జైడస్, కాడిలా, టోరెంట్ ఫార్మాసూటికల్స్, వోక్ హార్ట్, అపోలో సహా పలు ప్రముఖ మందుల తయారీ, విక్రయ కంపెనీల యాజమాన్యాలతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
కఠిన చర్యలు తప్పవు..
‘సాథీ' అనే ప్రభుత్వేతర సంస్థ నివేదిక వెలువడిన తర్వాత దేశంలోని ప్రధాన ఫార్మా కంపెనీలతో పీఎంవో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మందుల అమ్మకాల కోసం తప్పుడుదారుల్లో వెళుతున్న కంపెనీలపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెటింగ్లో నీతి, విలువలు పాటించండి.. లేదంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.
ప్రధాని హెచ్చరిక..
అంతేగాక, పద్ధతి మార్చుకోకుంటే తీవ్రమైన చట్టాలు కూడా తీసుకువస్తామని ప్రధాని హెచ్చరించారు. కాగా, మార్కెటింగ్లో ప్రవేశించిన చెడు సంప్రదాయాలను కట్టడిచేసే చట్టాలు, నిబంధనలను రూపొందించాలని ఇప్పటికే రసాయనాలు, ఎరువులు, వైద్య శాఖలను ప్రధాని ఆదేశించినట్లు తెలిసింది.
అమ్మాయిల ఎర, పబ్ల్లో రేవ్ పార్టీలు..
కాగా, ఆదివారం జూబ్లీహిల్స్ పబ్లో ఓ ఫార్మా కంపెనీ రేవ్ పార్టీ నిర్వహించిందని పోలీసు వర్గాలు తేల్చాయి. తమ కంపెనీ సేల్స్ పెంచుకునేందుకు డాక్టర్లు, సంబంధిత సిబ్బందికి ఈ పార్టీ ఏర్పాటు చేశారని, అందమైన యువతలతో అశ్లీల నృత్యాలు, వ్యభిచారం చేయించారని నిర్ధరించారు. పబ్ బుకింగ్ కూడా సదరు కంపెనీ పేరునే జరగడం గమనార్హం. ఇలా పలు ప్రముఖ ఫార్మా కంపెనీలు కూడా అమ్మాయిలను ఎరగా వేస్తూ తమ సేల్స్ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ సదరు ఫార్మా కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పద్ధతులకు ముగింపు పలకాలని ప్రధాని హెచ్చరించారు.