పుల్వామా దాడిపై దేశం కన్నీరు పెడుతుంటే...మోడీ సినిమా షూటింగ్లో ఉన్నారు: సూర్జేవాలా
ఢిల్లీ: ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి చేసిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో ఓ డాక్యుమెంటరీ షూటింగ్లో ఉన్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా విమర్శించారు. పుల్వామా దాడి మధ్యాహ్నం 3:10 గంటలకు జరిగినట్లు వార్తలు వస్తే... ప్రధానిగా బాధ్యతలు విస్మరించి సాయంత్రం 6:30 గంటల వరకు జిమ్ కార్బెట్లో ఉన్నారని ధ్వజమెత్తారు. సాయంత్రం 6:40 గంటలకు అక్కడి నుంచి బయటకొచ్చారని అప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ కూడా చేయలేదని సూర్జేవాలా ధ్వజమెత్తారు.
ఉగ్రదాడుల్లో 40 జవాన్లు అమరులై దేశం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంటుండగా ప్రధాని మాత్రం సినిమా షూటింగ్లో పాల్గొన్నారని ధ్వజమెత్తారు సూర్జేవాలా. ఇలాంటి ప్రధాని ప్రపంచంలో మరొకరుండరని సూర్జేవాలా అన్నారు. ఇక సాయంత్రం 7:10 గంటలకు టీ కోసం రామ్నగర్ పీడబ్ల్యూడీ అతిథి గృహానికి చేరుకున్నారని ... అంటే దాడి జరిగిన తర్వాత నాలుగు గంటల వరకు మోడీ ఘటనపై ఒక్క స్టేట్ మెంట్ కూడా చేయలేదని నిప్పులు చెరిగారు సూర్జేవాలా.
మరోవైపు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఆల్ఫోన్స్ మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాను పార్థీవదేహంతో సెల్ఫీ దిగి ఫేస్బుక్లో పోస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు సూర్జేవాలా. పుల్వామా దాడిలో అమరుడైన కేరళకు చెందిన హవిల్దార్ వసంత్ కుమార్ నివాసానికి నివాళులు అర్పించేందకు వెళ్లిన అల్ఫోన్స్ అక్కడ సెల్ఫీ దిగారు. అయితే దీనిపై అల్ఫోన్స్ వివరణ ఇచ్చారు. అది సెల్ఫీ కాదని మరెవరో తీసిన ఫోటో అని చెబుతూనే దీనిపై డీజీపీ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు.