ప్రధాని నరేంద్ర మోడీ హత్య, భారత దేశం ముక్కలు కావడం ఖాయం: హఫీజ్ అనుచరుడు
న్యూఢిల్లీ: 2008 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని పాక్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా (జేయూడీ) బహిరంగంగా బరి తెగించింది. ఆ సంస్థకు చెందిన, హఫీజ్ సయిద్ అనుచరుడు ఒకడు భారత్ పైన, ప్రధాని నరేంద్ర మోడీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
భారత్, అమెరికా దేశాల్లో ఇస్లాం జెండా ఎగురుతుందని, మోడీని చంపేస్తామని, భారత్, ఇజ్రాయెల్ దేశాలు ముక్కలు కావడం తథ్యమని జేయూడీ నాయకుడు మౌలానా బషీర్ అహ్మద్ ఖలీ దారుణ వ్యాఖ్యలు చేశాడు.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని రావల్కోట్లో ప్రసంగిస్తూ మౌలానా బషీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. జేయూడీ కేడర్ ఇప్పటికీ కాశ్మీర్లో జీహాద్ నడుపుతున్నాయని, కాశ్మీర్లోని భారత సైనికులతో పోరాడుతున్నాయని, భారత్ను ముక్కలు చేసి కాశ్మీర్ను విడిపించేందుకే వారు పోరాడుతున్నారని చెప్పాడు. వారంతా కాశ్మీర్లో జీహాదీ జెండా ఎగరేయాలని కోరుతున్నామన్నాడు.
కాశ్మీర్లోని యువకులు జీహాద్లో చేరాలని, స్థానికులు విరాళంగా గోధుమలు, డబ్బు ఇవ్వాలని కోరాడు. జేయూడీపై ఈ ఏడాది ప్రారంభం నుంచి అంతర్జాతీయ సమాజం ఉక్కుపాదం మోపుతోంది. ముంబై పేలుళ్లు సహా పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో కుట్ర పన్నిన హఫీజ్ సయీద్ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. అతడి తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది.