ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరితే: ప్రధానికి హీరేమఠ్ హెచ్చరిక
మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణను బీజేపీలోకి తీసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ క్రెడిబులిటీ దెబ్బతింటుందని సమాజ్ పరివర్తన సంస్థ వ్యవస్థాపకులు ఎస్ఆర్ హిరేమఠ్ హెచ్చరించారు. కృష్ణ అవినీతిపరుడు అన్నారు.
బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణను బీజేపీలోకి తీసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ క్రెడిబులిటీ దెబ్బతింటుందని సమాజ్ పరివర్తన సంస్థ వ్యవస్థాపకులు ఎస్ఆర్ హిరేమఠ్ హెచ్చరించారు. కృష్ణ అవినీతిపరుడు అన్నారు.
ఆయనను బీజేపీలో చేర్చుకోవద్దని చెప్పారు. అవినీతిలో కూరుకుపోయిన ఎస్ఎం కృష్ణను బీజేపీలో చేర్చుకుంటే పార్టీకే నష్టమన్నారు. ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్దార్థ చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకాలో 180 ఎకరాల అటవీభూమిని ఆక్రమించుకున్నారన్నారు.
అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రధాని ఇలాంటి కబ్జాకోరులను పార్టీలో చేర్చుకోవడం సరికాదన్నారు. అవినీతిపరుల పాలిట దేశ వ్యాప్తంగా సింహస్వప్నం అనిపించుకుంటున్న ప్రధాని మోడీ.. అలాంటి వారిని చేర్చుకునే అంశంపై ఆలోచించాలన్నారు.
తేల్గీ స్టాంపుల కుంభకోణంలో సిద్దార్థ పేరుందని, కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ను కిడ్నాప్ చేసిన వీరప్పనకు నగదు సమకూర్చడంలో సిద్దార్థ మధ్యవర్తిగా వ్యవహరించారని ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు పాటించినవారికి బీజేపీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా సోదరి మృతితో బీజేపీలో చేరే ప్రక్రియకు అంతరాయం కల్గిన తరుణంలో వెనుతిరిగి వచ్చిన ఎస్ఎం కృష్ణ సోమవారం ఢిల్లీకి బయలుదేరుతున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతోపాటు పలువురు ముఖ్యునేతలతో చర్చలు జరిపే అవకాశముంది. కర్నాటకలో ఉప ఎన్నికలలో ప్రచారం నేపథ్యంలో వెనువెంటనే ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరే అవకాశముంది.