క్రిస్మస్ రోజున పీఎం కిసాన్ నిధులు: మోడీ: 6 రాష్ట్రాల రైతులతో భేటీ: రూ.18 వేల కోట్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మరో విడత నిధులు విడుదల కానున్నాయి. మరో విడత చెల్లింపుల కింద కేంద్ర ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయబోతోంది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఈ మొత్తాన్ని కేంద్రం విడుదల చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ నిధులను విడుదల చేస్తారు. అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్లలోకి ఈ మొత్తాన్ని బదలాయిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది.
ప్రధాని మోడీ అనూహ్య చర్య: అన్ ప్లాన్డ్, అన్ షెడ్యూల్: హఠాత్తుగా గురుద్వారాలో: బందోబస్తు లేకుండా
క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాలతో పాటు భారతరత్న, మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కూడా కావడం వల్ల ఈ నెల 25వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నరేంద్ర మోడీ నిర్ణయించినట్లు చెబుతున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద నిధులను విడుదల చేసిన తరువాత.. ఆయన ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులతో ముఖాముఖి భేటీలో పాల్గొంటారు. ఇదంతా ఆయన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగుతుంది.
ఒకవంక మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా ఉత్తరాది రైతులు దేశ రాజధానిని ముట్టడించిన ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్ర మోడీ.. మరో విడత కిసాన్ సమ్మాన్ నిధుల మొత్తాన్ని విడుదల చేయబోతోండటం ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రైతులను ఉద్దేశించి.. ప్రధాని ఏం మాట్లాడుతారు? ఎలాంటి సందేశాన్ని వినిపిస్తారనేది చర్చనీయాంశమౌతోంది.
మొన్నటికి మొన్న ఆయన మధ్య ప్రదేశ్కు చెందిన రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మూడు వ్యవసాయ బిల్లులను తీసుకుని రావడానికి గల కారణాలను వివరించారు. అలాగే- ఈ బిల్లులపై రైతులను ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పక్కదారి పట్టిస్తున్నారని మండి పడ్డారు. రైతులకు తప్పుడు సమాచారాన్ని చేరవేసేలా ప్రత్యర్థి పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతుకు లాభం కలిగించేలా ఈ బిల్లుల ద్వారా వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.