పాత రాజధానిలో ప్రధాని వీకెండ్.. అసాధారణ భద్రత.. బద్ధ శత్రువుల కలయిక.. భారీ కార్యక్రమాలు..
బ్రిటిష్ జమానాలో.. ఢిల్లీ కంటే ముందు భారత రాజధానిగా వెలుగొందింది కోల్కతా సిటీ. అప్పటి దర్పానికి గుర్తుగా మిగిలిన భవంతులు కాలక్రమంలో కళావిహీనంగా తయారయ్యాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వాటికి ఈ మధ్యే కొత్త హంగులు దిద్దారు. అలాగే, దేశానికి ఎనలేని సేవలందిస్తోన్న కోల్కతా పోర్టు ట్రస్టు 150వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ఈ వీకెండ్ కోల్కతాలో గడపనున్నారు. రాజకీయంగా బీజేపీకి బద్ధశత్రువులా వ్యవహరిస్తోన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనూహ్యరీతిలో మోదీతో వేదిక పంచుకోనున్నారు.
ఆ నాలుగు భవంతులు..
మోదీ రెండ్రోజుల కోల్కతా పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రధాని కార్యాలయం(పీఎంవో) శుక్రవారం వెల్లడించింది. శనివారం సాయంత్ర కోల్కతాకు వెళ్లనున్న ఆయన.. కేంద్రం పునరుద్ధరించిన విక్టోరియా మెమోరియల్ హాల్, ఓల్డ్ కరెన్సీ బిల్డింగ్, బెల్వదీర్ హౌజ్, మెట్కాఫే హౌజ్ భవంతులను జాతికి అంకితం చేస్తారు.
జాతిరత్నం.. కేవోపీటీ
1870లో ఈస్ట్ ఇండియా కంపెనీచే స్థాపింపబడి, కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న కోల్కతా పోర్ట్ ట్రస్ట్(కేవోపీటీ) 150వ వార్షికోత్సవాలు ఆదివారం జరుగనున్నాయి. ఈ వేడుకలో ప్రధాని మోదీ చీఫ్ గెస్టుగా పాల్గొంటారు. కేవోపీటీ రిటైర్డ్ ఉద్యోగులకు ఫైనల్ సెటిల్మెంట్ గా రూ.501 కోట్ల రూపాయల చెక్కును అందజేయనున్నారు. సంస్థ మాజీ ఉద్యోగులైన ఇద్దరు (నగీనా భగత్-105 ఏండ్లు, నరేశ్చంద్ర చక్రవర్తి-100ఏండ్లు) శతాధిక వృద్ధులను ప్రధాని సన్మానించనున్నారు. అదే వేదికపై నుంచి పోర్టుకు సంబంధించిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు.
టైట్ సెక్యూరిటీ..
పౌరసత్వ సవరణ, ఎన్నార్సీ చట్టాలకు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతుండటం, ఆందోళనలకు ముఖ్యమంత్రి మమతే నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన సందర్భంగా కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రయాణించనున్న మార్గాలు, పర్యటించే ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేశారు.
మోదీతో దీదీ..
ప్రాణంపోయినా సీఏఏ, ఎన్సార్సీ చట్టాలను వెస్ట్ బెంగాల్ లో అమలు చేయబోనంటూ కేంద్రానికి సవాలు విసిరిన సీఎం మమతా బెనర్జీకి కూడా ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని కార్యక్రమాలకు రావాల్సిందిగా ఆహ్వానాలు వెళ్లాయి. ఆదివారం జరిగే కోల్కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవవేడుకలో మోదీతోకలిసి దీదీ వేదిక పంచుకుంటరని తెలిసింది. అయితే దీదీ ఏక్షణమైనా మనసుమార్చుకునే అవకాశాలన్ని కొట్టిపారేయలేమని టీఎంసీ వర్గాలు అంటున్నారు. సీఏఏ నిరసనల నేపథ్యంలో ఈ మధ్యే ప్రధాని తన అస్సాం పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. వెస్ట్ బెంగాల్ లోనూ ఆందోళనలను అట్టుడుకుతున్నవేళ ప్రధాని మోదీ కోల్కతా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.