నేను ఉన్నాను, ఫ్యామిలీకి ధైర్యం చెప్పిన ప్రధాని మోడీ: నివాళులు, నమ్మలేకపోతున్నా!
బెంగళూరు: ప్రజల సమస్యల పరిష్కారం కోసం 30 ఏళ్లుగా నిరంతరం శ్రమించిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ను ప్రజలు ఎప్పటికి మరిచిపోరని, ఆయన లేరని నమ్మలేకపోతున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇంత కాలం తనతో పాటు దేశ అభివృద్ది కోసం శ్రమించిన అనంత్ కుమార్ లేనిలోటు ఎప్పటికీ తీరదని ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. తాను మీకు అండగా ఉన్నానని, ధైర్యంగా ఉండాలని అనంత్ కుమార్ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర మోడీ ఓదార్చారు.
ప్రత్యేక విమానం
సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం చేరుకున్నారు. కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలా, ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రధాని నరేంద్ర మోడీని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా నిరాండంబరంగా ఆహ్వానించారు.
విషాదంలో ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ బసవనగుడిలోని అనంత్ కుమార్ ఇంటికి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ఆ సందర్బంలో నాయకులు, ప్రజలు అనంతకుమార్ ఇంటిలోకి ప్రవేశించకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాక సందర్బంగా అనంత్ కుమార్ ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ విషాదంతో అనంత్ కుమార్ ఇంటిలోకి వెళ్లారు.
సన్నిహితుడు దూరం అయ్యారు
తన మంత్రి వర్గంలో ఎంతో చురుకుగా పని చేసిన అనంత్ కుమార్ దూరం అయ్యారని ప్రధాని నరేంద్ర మోడీ విషాదం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అనంత్ కుమార్ పార్థీవదేహం వద్ద పుష్పగుచ్చం పెట్టి ఆయనకు అంతిమ నివాళులు అర్పించారు. గవర్నర్ వాజుబాయ్ వాలా, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప తదితరులు అనంత్ కుమార్ కు నివాళులు అర్పించారు.
కుటుంబ సభ్యులకు హామీ
కేంద్ర మంత్రి అనంత్ కుమార్ కుటుంబ సభ్యులతో ఓ గదిలో ప్రత్యేకంగా సమావేశం అయిన ప్రధాని నరేంద్ర మోడీ వారిని ఓదార్చారు. అన్ని విషయాలు తాను చూసుకుంటానని ధైర్యంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ అనంత్ కుమార్ సతీమణి తేజస్విని, వారి ఇద్దరు కుమర్తెలను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. దాదాపు 10 నిమిషాల పాటు అనంత్ కుమార్ కుటుంబ సభ్యులతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించారు.
మౌనంగా మోడీ
అనంత్ కుమార్ ఇంటి దగ్గరకు వచ్చి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ చాలసేపు మౌనంగానే ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులతో సహ ఎవ్వరితో ప్రధాని మోడీ ఎక్కువగా మాట్లాడలేదు. అనంతకుమార్ కుటుంబ సభ్యులతో మాత్రమే ప్రధాని మోడీ ఎక్కవు సేపు మాట్లాడారు. గవర్నర్ వాజుబాయ్ వాలా, ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామితో ప్రధాని నరేంద్ర మోడీ మర్యాదపూర్వకంగా మాట్లాడారు. అనంతరం ప్రత్యేక విమానంలో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ వెళ్లిపోయారు.