త్రిమూర్తులు బెంగళూరు పరువు తీశారు, ప్రపంచంలో మూడో స్థానంలో భారత్: ప్రధాని మోడీ!
బెంగళూరు: టెక్నాలజీ రంగంలో భారతదేశం ప్రపంచంలోని టాప్ త్రీలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కర్ఱాటక ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని జీవితాంతం మరచిపోలేనని ప్రధాని మోడీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన త్రీమూర్తులతో దేశ వ్యాప్తంగా బెంగళూరు పరువుపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.
బెంగళూరు నగరంలోని బసవనగుడిలోని నేషనల్ కాలేజ్ మైదానంలో మంగళవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శించారు. జయనగర బీజేపీ ఎమ్మెల్యే విజయకుమార్ హఠ్మారణానికి శ్రధ్దాంజలి ఘటించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.
బెంగళూరు పరువు తీశారు
ప్రపంచ వ్యాప్తంగా బెంగళూరుకు ఎంతో పేరు ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే ముగ్గురి కారణంగా బెంగళూరు పరువు పోయిందని ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. బెంగళూరు నగరానికి మళ్లీ పూర్వవైభవం కాంగ్రెస్ నాయకులు తీసుకువస్తారా అని ప్రధాని మోడీ ప్రశ్నించారు.
త్రిమూర్తులు
హోం మంత్రిగా ఉన్న సమయంలో ఒకరు వేధించడం వలన నిజాయితీ పరులైన అధికారుల ఆత్మహత్యకు కారణం అయ్యారు, ఆయన పేరు మీకు తెలుసు (జార్జ్). మరో మంత్రి విదేశాల నుంచి డబ్బులు తెచ్చి అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నారని ఆయన పేరు మీకు తెలుసు (మంత్రి రోషన్ బేగ్, మరో శాసన సభ్యులు శాంతిని మాత్రం పక్కన పెట్టి మిగిలిన అన్ని పనులు చేస్తున్నాడు, అతని పేరు మీకు తెలుసు (శాంతి నగర్ ఎమ్మెల్యే నలపాడ్ హ్యారీస్) అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగంగా అన్నారు.
సూట్ కేసులు తీసుకున్న సీఎం
సీఎం సిద్దరామయ్య సూట్ కేసులు తీసుకుని ఏసీబీతో మంత్రులు, ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇప్పిస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. బెంగళూరు నగరంలోని రోడ్లు మొత్తం గుంతల మయం అయ్యాయని, అనేక మంది అమాయకుల ప్రాణాలు పోయాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్
సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ తో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నడిపించారని., ఐదు సంవత్సరాల నుంచి కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వాన్ని అలాగే నడిపిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగంగా అన్నారు. గాంధీ కుటుంభానికి ఈ కాంగ్రెస్ నాయకులు గులాములు అయ్యారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.
కన్నడకు అవమానం
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల మేనిఫెస్టో ఇటీవల విడుదల చేశారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మేనిఫెస్టోలో ప్రతిపేజీలో తప్పులు ఉన్నాయని, కన్నడకు అవమానం చేస్తూ వీరు ఢిల్లీలో దానిని తయారు చేయించారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. యడ్యూరప్పను ముఖ్యమంత్రి చేస్తే బెంగళూరు నగరంతో సహ కర్ణాటకను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తారని, బీజేపీకి ఓటు వెయ్యాలని ప్రధాని నరేంద్ర మోడీ మనవి చేశారు.