కాంగ్రెస్ కుల, మత రాజకీయాలు, హిందూ, ముస్లీం అనే తేడా లేదు, ఢిల్లీలో విభజన: ప్రధాని మోడీ !
బెంగళూరు: కులం, మతం పేరుతో ప్రజలను విభజించి పాలించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని, ఆ పార్టీకి కర్ణాటక ప్రజలు తగిన బుద్ది చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తాము ప్రజలు సంతోషంగా ఉండాలని ఓట్లు అడుగుతున్నామని, కాంగ్రెస్ పార్టీ కుటుంబం కోసం ఓట్లు అడుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఆడబిడ్డలను రక్షించడం కోసం కఠిన చట్టాన్ని తీసుకువస్తున్నామని, అందులో హిందూ, ముస్లీం అనే తేడా లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం కర్ణాటకలోని విజయపురలో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు.
బసవేశ్వరుడి జన్మభూమి
విజయపుర భగవాన్ బసవేశ్వరుడి జన్మభూమి అని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. కులం, మతం పేరుతో ప్రజలు విడదీయరాదని బసవణ్ణ తత్వాలు చెబుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. అయితే ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు కులం, మతం పేరుతో ప్రజలను విభజించి రాజకీయం చేస్తున్నారని, ఇలాంటి వారిని సమాజం క్షమించదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
ఢిల్లీలో రాజకీయాలు
కర్ణాటకలో కరువు తాండవం చేస్తోందని, విద్యాశాఖలో అనేక సమస్యలు ఉన్నాయని, నీటి సమస్య ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే ఈ శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు ఇక్కడి సమస్యలు పరిష్కరించకుండా ఢిల్లీలో కుర్చుని కులాలు చీల్చుతున్నారని, వీరికి మీరు ఎలాంటి బుద్దిచెబుతారని ప్రధాని మోడీ స్థానిక ప్రజలను ప్రశ్నించారు.
12 కోట్ల మందికి రుణాలు
ముద్రా పథకం ద్వారా 12 కోట్ల మంది యువకులకు రుణాలు ఇచ్చామని, వారు స్వయం ఉపాదితో సొంత కాళ్ల మీద నిలబడ్డారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయుష్మాన్ భారత్ పథకంతో ప్రాణాంతక వ్యాదులు వచ్చిన వారి చికిత్స కోసం రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.
హిందూ, ముస్లీం తేడా లేదు
ఆడబిడ్డలు ఎవరైనా ఒక్కటే అని, అందులో హిందూ, ముస్లీం అనే తేడా లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అడబిడ్డలను సురక్షింతంగా రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నామని, వారి మీద లైంగిక దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించడానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోడీ అన్నారు.
తలాక్ ను అడ్డుకున్నారు
ముస్లీం ఆడపడుచుల జీవితాలు నాశనం కాకుండా ఉండటానికి తలాక్ ను బ్యాన్ చెయ్యడానికి చట్టం తీసుకు వచ్చామని, ఆ చట్టం అమలు కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటున్నదని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఆడబిడ్డలు సురక్షితంగా ఉండటం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇష్టం లేదని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు.
10 కోట్ల గ్యాస్ కనెక్షలు !
సిద్దరామయ్య ప్రభుత్వంలో అవినీతికి పాల్పడని ఒక్క మంత్రి ఎవరైనా ఉన్నారా చెప్పండి అని ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. ఆడపడుచులు కట్టెలతో వంట చేసుకోవడం కష్టంగా ఉంటుందని, అందుకే తాము అధికారంలోకి వచ్చిన తరువాత 10 కోట్ల గ్యాస్ కనెక్షలు మంజూరు చేశామని, కర్ణాటకలోనే 10 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షలు ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.