బెంగళూరును సర్వనాశనం: ట్రాఫిక్ జామ్, క్రైం, చెత్త, గుంతలు కాంగ్రెస్ వరాలు: మోడీ ఫైర్!
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో బెంగళూరు నగరానికి ఎలాంటి వరాలు కురిపించిందో అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తనదైన శైలిలో వ్యంగంగా చెప్పారు. గార్డెన్ సిటి అనే పేరున్న బెంగళూరు సిటీని గార్బేజ్ సిటి(చెత్తసిటి)గా, సిలికాన్ సిటీ అనే పేరున్న బెంగళూరు సిటీని దుర్వాసన సిటీగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బెంగళూరులోని కంగేరీలో గురువారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు నగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆరోపించారు. ప్రజలు జేడీఎస్ కు ఓటు వేసి మోసపోకూడదని మోడీ మనవి చేశారు.
కంప్యూటర్ సిటీ కాదు
బెంగళూరు నగరానికి కంప్యూటర్ సిటీగా పేరుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్రైం సిటీగా మారిపోయిందని ప్రధాని మోడీ ఎద్దేవ చేశారు. కాస్మోటిక్ కల్చర్ ఉన్న బెంగళూరు నగరాన్ని అట్టహాసం నగరంగా మార్చివేశారని ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ వరాలు
గార్డెన్ సిటీ అనే పేరున్న బెంగళూరును గార్బేజ్ సిటీ (చెత్తనగరం)గా, సిలికాన్ వ్యాలి అని పిలిచే బెంగళూరును దుర్వాసన సిటీగా తీర్చిదిద్దిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీదే అని మోడీ అన్నారు. ట్రాఫిక్ జామ్, రోడ్ల మీద భారీ గుంతలు, ఆ గుంతల్లో సామాన్య ప్రజలు మరణించారని, అదే ఈ నగరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వరాలు అని ప్రధాని మోడీ అన్నారు.
దొంగల సామ్రాజ్యం
పట్టపగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రజలను దుండగులు దోచుకుంటున్నారని, ఆ దొంగలను బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు చాకచ్యంగా ఎదుర్కొంటున్నారని ప్రధాని మోడీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పి దొంగల సామాజ్యం నిర్మించిదని ప్రధాని మోడీ ఎద్దేవ చేశారు.
స్పోర్ట్స్ ఆఫ్ హబ్ కాదు పాట్ హోల్ హబ్
బెంగళూరుకు స్పోర్ట్స్ ఆఫ్ హబ్ అనే పేరు ఉందని, దానిని కాస్తా కాంగ్రెస్ ప్రభుత్వం పాట్ హోల్ హబ్ (రోడ్ల మీద గుంతలు) చేసేసిందని ప్రధాని మోడీ వ్యంగంగా అన్నారు. కర్ణాటకలో అశ్వినీ పోన్నప్ప, గురురాజ్ లాంటి అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు.
చక్కటి అవకాశం
బెంగళూరు నగర ప్రజలు గత ఐదు సంవత్సరాలుగా ట్రాఫిక్ జామ్, రోడ్ల మీద గుంతలు, దోపిడీలు, దుర్వాసన, చెత్త, తాగునీటి సమస్యలతో సతమతం అయ్యారని, ఆ సమస్యలు అన్నీ పరిష్కారం కావడానికి మే 12వ తేదీన చక్కటి అవకాశం ఉందని, మీ అమూల్యమైన ఓటు బీజేపీకి వేసి మీ సమస్యలు మీరే పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు నగర ప్రజలకు మనవి చేశారు.